మొన్నటి వరకు హుజరాబాద్ నియోజకవర్గం పై అన్ని పార్టీలు పూర్తిగా దృష్టి సారించాయి.సభలు, సమావేశాలు వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇలా చాలానే హడావుడి నడిచింది.
బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీల నేతలు ఆ నియోజకవర్గంలోనే మకాం వేసి మరీ తమ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు.ఎప్పుడైతే హుజురాబాద్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసిందో అప్పటి నుంచి పార్టీల జోరు పూర్తిగా తగ్గిపోయింది.
అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో చక్కర్లు కొట్టిన వివిధ పార్టీల నేతలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ పడినప్పుడు చూద్దాం అన్నట్లుగా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
అయితే ఈ నియోజకవర్గం విషయంలో మంత్రి హరీష్ రావు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఈ నియోజకవర్గం గెలుపు బాధ్యతలను కేసీఆర్ తనపై వేయడంతో, ఎలా అయినా తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు గెలుపు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
నిరంతరం నియోజకవర్గంలోని కీలక నేతలను కలవడం, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం, సామాజిక వర్గాల వారీగా తమకు అండదండలు ఉండేలా చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం ఇలా హరీష్ రావ్ ఎక్కడలేని టెన్షన్ పడుతూ, పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.ముఖ్యంగా ఈటెల రాజేందర్ బలం, బలగాలను అంచనా వేస్తూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా రాజేందర్ వైపు ఉంది అనే విషయం తేలడంతో, ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు త్వరలోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే హామీ కూడా ఇచ్చారు.
అలాగే స్థలం ఉండి ఇల్లు లేని రెడ్డి సామజిక వర్గం వారికీ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.ప్రత్యేకంగా ఈ సామాజికవర్గం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు.సందర్భం ఉన్నా లేకపోయినా తరచుగా ఈ నియోజకవర్గం నాయకులతో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.మిగతా టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే లు, మంత్రులు ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నా, హరీష్ మాత్రం ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడం లేదు.