తెలంగాణ రాజకీయాల్లో ఏవేవో, ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇప్పటి వరకు తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఉగాది నాటికి ఆయన సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ వ్యాఖ్యలు చేయడంతో, ఇదే నిజం అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది.
దీనిపై రకరకాల ఊహాగానాలు పెరిగిపోతుండటంతో ఆకస్మాత్తుగా ఈ అంశానికి కేసిఆర్ చెక్ పెట్టారు.పదేళ్ల పాటు సీఎంగా ఉంటానని గతంలోనే నేను చెప్పానని, ఇకపై ఎవరూ ఇష్టానుసారంగా సీఎం మార్పు వ్యవహారం పై కామెంట్స్ చేయవద్దు అని, కేసీఆర్ గట్టిగానే పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే, తెలంగాణ సీఎం రేసులో మంత్రి ఈటెల రాజేందర్ పేరు కొద్దిరోజులుగా ప్రచారంలోకి వస్తోంది.అదే సమయంలో ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ లో సీఎం మార్పు విషయమై పెద్ద చర్చ జరుగుతున్న సమయంలోనే, ఈటెల చిరుతో భేటీ అవ్వడం వెనుక రాజకీయం ఏంటా అని ఆరా తీసే పనిలో ఇప్పుడు పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి.
మంత్రి హోదాలో ఉన్న ఈటెల చిరంజీవిని ఆయన నివాసంలో కలవడం వెనుక ఏదో రాజకీయం ఉంది అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.
అయితే ఈటెల తన జిల్లాలోని హుజురాబాద్ కు చెందిన కళాకారులు, నిరుద్యోగ యువతకు సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పించాలి అని కోరేందుకు వెళ్ళినట్లుగా ఈటెల వర్గీయులు చెబుతున్నా, దాని వెనుక ఏదో రాజకీయం ఉంది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.అసలు కీలకమైన మంత్రి స్థానంలో ఉన్న ఈటెల, నిరుద్యోగ సమస్యలు తీర్చాలంటూ చిరంజీవిని కోరడం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
కేవలం ఒక జిల్లా పరిధిలోని వారి కోసం చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్తారనే ప్రశ్న మొదలయ్యింది.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నా, ఆయనకు సొంతంగా స్టూడియో లేదు.కేవలం నిర్మాణసంస్థ మాత్రమే ఉంది.అదీ కాకుండా, చిరంజీవికి పదవులు ఏవీ లేవు.అటువంటి ఆయన నిరుద్యోగ సమస్యను ఏ విధంగా తీర్చుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.వీరిద్దరి భేటీ వెనుక రాజకీయం ఉంది అని, గత కొంతకాలంగా కేసీఆర్ వ్యవహారశైలి పై ఈటెల అసంతృప్తి తో ఉండడం, సీఎం మార్పు, సీఎం రేసులో కేటీఆర్, ఈటెల రాజేంద్ర పేరు ప్రస్తావనకు రావడం తదితర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే వీరి భేటీ జరిగింది అనే టాక్ నడుస్తోంది.