తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే కొంతమంది నాయకులు వెళ్లిపోగా మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలతో టీడీపీలో ఎక్కడలేని కంగారులో కనిపిస్తోంది.ఈ కంగారు మరింత పెరిగేలా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి టీడీపీని మరింత కంగారుకి గురిచేసారు.
త్వరలోనే టీడీపీ ఎమ్యెల్యే ఒకరు మా పార్టీలోకి రాబోతున్నారు అంటూ ఆయన ప్రకటించగానే ఎవరా ఎమ్యెల్యే అంటూ టీడీపీ ఆరా తీసేపనిలో పడింది.ఇప్పటికే సగమంది బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో వైసీపీ వైపు వెళ్లబోతుంది ఎవరా అనే సందిగ్ధత టీడీపీలో కనిపిస్తోంది.
కర్నూలులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసి బయటకి వెళ్లిపోయారు.
అలా వెళ్లడమే కాకుండా వెళ్తూ వెళ్తూ లోకేశ్పై వంశీ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను టీడీపీ సస్పెండ్ చేసింది.ఆయన త్వరలోనే వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ షాక్ నుంచి తేరుకోకుండానే ఇప్పుడు మరో ఎమ్యెల్యే వైసీపీలోకి వస్తున్నారు అంటూ అనిల్ కుమార్ ప్రకటించడంతో అందరి చూపు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మీద పడింది ఆయన త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వస్తారని జోరుగా ప్రచారం ఊపందుకుంది.