జగన్ కేబినెట్ లో ఫైర్ బ్రాండ్ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి యువ నాయకుడు.చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటన లో లోకేష్ వైసిపి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుడు కమల్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడగా, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లినా, ఆ కుటుంబం ఆచూకి దొరకలేదు.
అయితే తాను వస్తున్నానని ఆ కుటుంబాన్ని వైసీపీ నేతలు మాయం చేశారంటూ లోకేష్ విమర్శించారు.ఆత్మహత్యకు పాల్పడ్డ కమల్ ను తిరిగి తీసుకు వస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు.
వైసిపి నాయకులు తనను చూసి భయపడుతున్నారని విమర్శలు చేశారు. జగన్ ఫేక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి యువకులను బలి తీసుకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఫేక్ క్యాలెండర్ ను రద్దుచేసి 2.1 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.తన పర్యటన ను చూసి మంత్రులు భయపడుతున్నారని లోకేష్ చేసిన కామెంట్స్ పై తాజాగా స్పందించిన అనిల్ లోకేష్ పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
చేతకానితనం కి లోకేష్ కేరాఫ్ అడ్రస్ అని, ఆయన ఒక అసమర్ధుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా విమర్శించారు.

లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని, లోకేష్ ను చూసి ఎవరు భయపడరు అని అనిల్ ఎద్దేవా చేశారు.అసలు ఏపీలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిందంటూ మండిపడ్డారు.లోకేష్ తండ్రిని, తాతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు.లోకేష్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.
తామంతా జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చామని.ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు.