ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు.పూర్తిగా ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి మద్దతు ఉంది.
దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం బలహీనం కావడంతో, వైసీపీకి తిరుగు లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.బిజెపి, జనసేన పార్టీల ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో, జగన్ ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్నారు.2019 లో వచ్చిన ఎన్నికల ఫలితాలే మళ్లీ 2024 లోనూ రావాలనేది జగన్ ఆకాంక్ష.అందుకే ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలలో తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే పనిలో జగన్ ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న రాజకీయ శత్రువులతో ఇబ్బందులు లేకపోయినా, జగన్ మాత్రం ఓ రాజకీయ పార్టీ విషయంలో కాస్త ఆందోళనలో ఉన్నారట.ఆ పార్టీనే ఎంఐఎం.ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో జగన్ మొదటి నుంచి సాన్నిహిత్యం ఉంది.ప్రతి దశలోనూ జగన్ కు సహకరిస్తూ అసదుద్దీన్ వస్తున్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తో ఉన్న రిలేషన్ ఎంఐఎం విషయంలోనూ జగన్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు.ఇక ఎంఐఎం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తూ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.అయితే చాలా చోట్ల ఎంఐఎం పోటీ చేసినా, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకా అనే అనుమానాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీ ఏపీలోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఏపీలో జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికలలో కొన్ని చోట్ల పోటీ చేసింది.
కానీ పూర్తి స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ప్రయత్నిస్తుండటంతో జగన్ ముందుగానే అలర్ట్ అయ్యారు.ఈ మేరకు పార్టీలోని నాయకులు కొందరు తాజాగా అసదుద్దీన్ ను కలిసి జగన్ ప్రభుత్వం మైనార్టీల విషయంలో ఏవిధంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.అలాగే ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ ల ఎంపిక లో మైనారిటీలకు పెద్దపీట వేసిన విషయాన్ని వైసిపి ప్రతినిధులు అసదుద్దీన్ కు వివరించినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ముందు ముందు వైసీపీ కి ఇబ్బందులు ఏర్పడకుండా ముందుగానే జగన్ అలెర్ట్ అయ్యి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.