మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారత సంతతి కార్పోరేట్ సారథి సత్య నాదెళ్లను ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది.గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ పురస్కారం దక్కింది.
సత్యతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ ఛైర్ బ్రాడ్ స్మిత్, సీఎఫ్ఓ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లుకాస్ జొప్పలు కూడా ఈ అవార్డును అందుకున్నారు.పర్యావరణ సానుకూలత, సృజనాత్మకత, దీర్ఘకాలిక వాణిజ్య విజయాలు.
ఈ మూడింటి ప్రాతిపదికగా కార్పొరేట్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.దీనిలో భాగంగానే 2030 కల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్ను మార్చడం; 2050 కల్లా చరిత్రాత్మక ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.
భారతీయ అమెరికన్ అయిన సీకే ప్రహ్లాద్ గౌరవార్థం 2010లో కార్పొరేట్ ఈకో ఫోరమ్(సీఈఎఫ్) ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని అంతర్జాతీయప్రైవేటు రంగంలో పర్యావరణహిత కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూత్న రీతిలో నిర్వహిస్తూ, వ్యాపార విజయాలను నమోదు చేస్తున్న వారికి ఇస్తూ వుంటారు.
సత్యనాదెళ్ల ప్రస్థానం: సత్య నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామం.ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి.2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.సత్య విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే సాగింది.
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు.
సన్ మైక్రోసిస్టమ్లోని టెక్ బృందంలో పనిచేసిన సత్యనాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు.కీలక విభాగాలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్లయింట్ సర్వీసెస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విండోస్ సర్వీర్, డెవలపర్ టూల్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2014లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు.క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు మొబైల్ రంగంపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు.న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ఇన్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో పాటు అనేక డీల్స్తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో సత్యనాదెళ్ల కీలక పాత్ర పోషించారు.
దీర్ఘకాలం పాటు మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరించిన సత్యనాదెళ్ల ఈ ఏడాది జూన్లో ఛైర్మన్గా ఎంపికయ్యారు.