అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న బిలియనీర్ మైఖేల్ బ్లూమ్బెర్గ్ తాను ఎన్నికల ప్రచారంలో జైలు కార్మికులను ఉపయోగించినట్లు అంగీకరించారు.ఎన్నికల ప్రచారం కోసం ఒప్పందం చేసుకున్న సంస్థ జైలు ఖైదీలను ఉపయోగిస్తున్నట్లు తనకు తెలియదన్నారు.
అయితే ఆ తర్వాత తాము సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
థర్డ్ పార్టీ వెండర్ ద్వారా న్యూజెర్సీ, ఓక్లహోమాలో కాల్ సెంటర్లను నడుపుతున్న ప్రోకామ్తో బ్లూమ్బెర్గ్ ఎన్నికల ప్రచార కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఓక్లహోమాలోని రెండు కాల్ సెంటర్లు అక్కడి జైళ్ల ద్వారా నడుస్తున్నాయి.రెండు జైళ్లలో ఒకదానిలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు బ్లూమ్బర్గ్ ప్రచారంలో భాగంగా ఓటర్లకు కాల్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీనిపై ప్రిజన్ లీగల్ న్యూస్ మేనేజింగ్ ఎడిటర్, ఖైదీల హక్కుల తరపు న్యాయవాది అలెక్స్ ఫ్రైడ్మాన్ మాట్లాడుతూ.ఇది ఖైదీల శ్రమను దోచుకోవడమేనన్నారు.కాగా బ్లూమ్బెర్గ్ 2020 అధ్యక్ష రేసులో ఆలస్యంగా ప్రవేశించి టీవీల్లో ప్రకటనల కోసం 120 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేశారు.అయినప్పటికీ రేసులో ముందంజలో ఉన్న జో బిడెన్, ఎలిజబెత్ వారెన్, బెర్నీ సాండర్స్, పీట్ బుట్టిగెట్ను చేరుకోవడంలో బ్లూమ్బర్గ్ వెనుకబడ్డారు.