సామాన్యంగా శివరాత్రికి శివ శివ అంటూ చలి వెళ్లిపోతుందని అంటారు.కానీ ఇంకా శివరాత్రి కూడా వెళ్లలేదు.
అంతలోనే సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు.ప్రస్తుతం పగలంతా కొడుతున్న ఎండలను చూస్తుంటే ముదిరిన వేసవిలా కనిపిస్తుంది.
అప్పుడే ఊహించనంతలా ఎండ వేడి శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.ఇకపోతే ఎండ తీవ్రతపై తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా నేడు, రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల వరకు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తుంది.
కాగా ఇందులో అగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల నేడు, రేపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఆదిలాబాద్లో 38 డిగ్రీలు, భద్రాచలంలో 38.5 డిగ్రీలు, ఖమ్మంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.