మరణశిక్ష పడి ప్రస్తుతం జైలులో వున్న భారతీయుడిని రక్షించడానికి సింగపూర్ ప్రజలు ఒక్కటయ్యారు.ఆయనకు ఉరిని నిలిపివేసి క్షమాభిక్ష కోరుతూ ఆన్లైన్ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు.
సింగపూర్లోని చాంగీ జైలులో వున్న భారత సంతతికి చెందిన మలేషియన్ను రక్షించడానికి గురువారం నాటికి 39,962 మంది సంతకాలు చేశారు.ఆయన 2010లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యాడు.సదరు వ్యక్తిని నాగేంద్రన్ కె ధర్మలింగంగా చెబుతున్నారు.
సింగపూర్లోకి అక్రమంగా డ్రగ్స్ను దిగుమతి చేసినందుకు గాను అతనికి 2010లో కోర్టు మరణశిక్ష విధించింది.
సింగపూర్ మీడియా కథనం ప్రకారం. మలేషియా నుంచి సింగపూర్కు ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి నాగేంద్రన్ కుటుంబానికి సహాయం చేస్తున్నామని సింగపూర్ హోం వ్యవహారాల శాఖ తెలిపింది.
అతనిని కలిసే వారికి ప్రతిరోజూ ముఖాముఖీ మాట్లాడేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే నాగేంద్రన్ క్షమాభిక్ష పిటిషన్ను అధ్యక్షుడు ఒకసారి తిరస్కరించారని హోంశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో నవంబర్ 10న ఆయనను ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నాగేంద్రన్ను ఎలాగైనా రక్షించాలని సింగపూర్లోని కొందరు వ్యక్తులు అక్టోబర్ 29న ఆన్లైన్ ద్వారా సంతకాల సేకరణను ప్రారంభించారు.ఇప్పటి వరకు దీనికి వేలాది మంది మద్ధతు ప్రకటిస్తూ సంతకాలు చేశారు.అతని ప్రియురాలిని చంపుతానని బెదిరించినందువల్లే నాగేంద్రన్ డ్రగ్స్ రవాణాకు పాల్పడ్డాడని సదరు పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా నాగేంద్రన్ మానసిక పరిస్ధితి కూడా బాలేదని తెలిపారు.అతను హైపర్ యాక్టీవిటి డిజార్డర్తో కూడా బాధపడుతున్నట్లు ప్రెసిడెంట్ హలీమా యాకోబ్కు పెట్టుకున్న పిటిషన్లో చెప్పారు.
నాగేంద్రన్ ఉరికి కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం వున్న నేపథ్యంలో మరింత మంది ఈ ఆన్లైన్ క్షమాభిక్ష పిటిషన్కు మద్ధతు తెలిపే అవకాశం వుంది.మరి వీరి విన్నపాన్ని అధ్యక్షుడు మన్నిస్తాడో లేదో తెలియాలంటే నవంబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.