2019 ఆఖరిలో చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి కరాళ నృత్యం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.వ్యాక్సిన్లకు సైతం లొంగకుండా కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
నలుగురితో కలవలేక, కనీసం స్వేచ్ఛగా తుమ్ముకునే వెసులుబాటు లేక మనిషి కుమిలిపోతున్నాడు.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలిరోజుల్లోనే కాదు.
ఇప్పుడు కూడా కోవిడ్ను కట్టడి చేయాలంటే అందుబాటులో వున్న ఏకైక మార్గం ‘‘లాక్డౌన్ ’’.ప్రజలు కలుసుకునే మార్గాలను మూసివేయడం ద్వారా మహమ్మారులను నియంత్రించవచ్చన్న పాఠంతో అన్ని దేశాలు లాక్డౌన్నే అనుసరించాయి.అయితే అన్ని చోట్లా ఇది ఒకేలా లేదు.కొన్ని చోట్ల నెలా, రెండు నెలల పాటు లాక్డౌన్ వుంటే ఇంకొన్ని చోట్ల మరో నెల అదనంగా అమలైంది.
కానీ ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరం మెల్బోర్న్ మాత్రం 9 నెలల పాటు లాక్డౌన్లోనే మగ్గిపోయింది.ఆంక్షలు ఎత్తివేయాలని ప్రజలు రోడ్డెక్కినా ప్రభుత్వం మాత్రం కఠినంగానే వ్యవహరించింది.
ఈ నేపథ్యంలో వారి ఆశలు ఫలించి దాదాపు 262 రోజుల లాక్డౌన్ నుంచి మెల్బోర్న్ వాసులకు విముక్తి లభించింది.శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పబ్లు, రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లకు ప్రజలు పోటెత్తారు.
కోవిడ్ వెలుగు చూసిన 2020 మార్చి నుంచి నేటి వరకు ఆరు సార్లు మెల్బోర్న్లో లాక్డౌన్ విధించారు.ప్రపంచంలోని ఏ నగరానికైనా ఇదే అత్యధికం.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ 234 రోజుల లాక్డౌన్తో మెల్బోర్న్ తర్వాతి స్థానంలో నిలిచింది.
లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గురువారం రాత్రి 11.59 గంటలకు ప్రజలంతా బాల్కనీలపై నుంచి చప్పట్లు కొట్టడంతో పాటు కారు హారన్లను మోగిస్తూ తమ సంతోషాన్ని తెలియజేశారు.రెండు వారాల క్రితం దేశంలోనే అతిపెద్ద నగరం సిడ్నీలో 107 రోజుల లాక్డౌన్ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్ధితులు చోటు చేసుకున్నాయో మెల్బోర్న్లో కూడా అదే రకమైన దృశ్యాలు కనిపించాయి.
ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 70 శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.మరోవైపు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించడంతో నవంబర్ నుంచి పలువురు ఆస్ట్రేలియా వాసులు విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు.క్వాంటస్ ఎయిర్వేస్ శుక్రవారం నుంచి పలు గమ్యస్థానాలకు విమానాలను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొత్త నిబంధనల ప్రకారం.మెల్బోర్న్లో రెస్టారెంట్లు, కేఫ్లను ప్రారంభించడానికి అనుమతించారు.అయితే ఇండోర్లో 20 మంది.ఔట్డోర్లో 50 మందికి మాత్రమే అనుమతించారు.
అలాగే 10 మంది వరకు ఇళ్ల వద్ద గుమిగూడవచ్చు.అయితే మాస్క్లు మాత్రం తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది.