ప్రతిష్టాత్మకంగా జరిగిన GHMC 2020 ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వెలువడతాయా అని ఇటు తెలంగాణ ప్రజలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా నేడు ఉదయం 8 గంటల నుండి ఈ ఎన్నికల ఫలితాల లెక్కింపును ఎన్నికల సంఘం మొదలుపెట్టింది.
మొత్తం ఎన్నికలు జరిగిన 150 డివిజన్ల ఓట్లను 30 సెంటర్లలో లెక్కించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది.ఒక్కో రౌండ్లో 14 వేల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు.ఇందులో బీజేపీ అత్యధికంగా 85 డివిజన్లలో ఆధిక్యాన్ని కనబర్చగా, తెరాస 37 స్థానాలు, ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యాన్ని సాధించాయి.
మిగతా డివిజన్లలో ఇంకా ఫలితాలు తేలలేదని అధికారులు వెల్లడించారు.ఇక సాధారణ ఓటింగ్ బ్యాలెట్లను లెక్కించడం ప్రారంభించారు అధికారులు.
తొలిరౌండ్లో ఫలితాలు ఎలా ఉంటాయా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.కాగా అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదైన మెహదీపట్నం డివిజన్లో ఫలితం తొలిరౌండ్ ముగిసే సరికే తేలిపోయింది.
ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహదీపట్నం డివిజన్లో గెలుపు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఇలా తొలి ఫలితం ఎంఐఎం అభ్యర్థికి వస్తుందని టీఆర్ఎస్, బీజేపీలు ఊహించలేదని ఆయా పార్టీల నాయకులు అంటున్నారు.
కాగా మెహదీపట్నంలో ఎన్ని ఓట్ల తేడాతో మాజిద్ హుస్సేన్ గెలుపొందారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.ఏదేమైనా GHMC ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన ఎంఐఎం అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రధాన ప్రత్యర్థి బీజేపీలకు గట్టి ఝలక్ ఇచ్చిందని చెప్పాలి.
కాగా తొలి రౌండ్లో మెజారిటీ డివిజిన్లలో తెరాస పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.మరి తొలిరౌండ్ లెక్కింపు ముగిసే సమయానికి ఆధిక్యంలో ఎవరు ఉంటారా అనే ఉత్కంఠ అభ్యర్ధుల్లో నెలకొంది.