కరెంటు దీపాలు లేక నాడు చెట్ల కింద చదువుకున్న ఓ కుర్రాడు నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.సైకిల్ కొనే స్తోమత లేక నాలుగు కిలోమీటర్ల దూరంలోని స్కూల్కి నడిచి వెళ్లిన బాలుడి వద్ద ఈరోజు ప్రపంచంలోని ఖరీదైన కార్లన్నీ వున్నాయి.
కృషి, పట్టుదల, అంకిత భావం వుంటే అతి సామాన్య స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరవచ్చని నిరూపించారు ప్రవాస భారతీయుడు జే చౌదరి.తన వద్ద వున్న సంపదతో భారతీయ కుబేరుల్లో 9వ స్థానం సంపాదించుకున్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.
1958 ఆగస్ట్ 26న భారతదేశంలోని అందమైన రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చిన్న గ్రామం పనోలో జన్మించిన జే పుట్టుకతో నిరుపేద.కష్టాల్లోనే ఆయన విధ్యాభ్యాసం సాగింది.
ఏడు, ఎనిమిది తరగతులు చదివే సమయంలో గ్రామంలో విద్యుత్ సౌకర్యం అంతగా లేదు.దీంతో ఆయన చెట్ల కింద, వీధి దీపాల కిందనే చదువుకున్నారు.
పనో గ్రామానికి పొరుగున ఉన్న దుసార గ్రామంలోని హైస్కూల్కు జే ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లి చదువుకునేవారు.ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన ఆయన అందుకు గర్వంగా వుందన్నారు.
ఎన్నో అవరోధాలను అధిగమించి జే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు.యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో మాస్టర్స్ చేసేందుకు ఆయన 1980లో తొలిసారిగా అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కారు.
చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోని ఐబీఎం, యూనిసిసి, ఐక్యూ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో సేల్స్ , మార్కెటింగ్ విభాగాల్లో పాతికేళ్ల పాటు ఉద్యోగం చేశారు.
అయితే ఆ తర్వాత సొంతంగా కంపెనీని ప్రారంభించాలని జేకి ఉండేది.దీంతో భార్య జ్యోతితో కలిసి ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి 1996లో సెక్యూర్ ఐటీ అనే స్టార్టప్ను ప్రారంభించారు.ఈ విజయంతో కోర్ హార్బర్, సైఫర్ ట్రస్ట్, ఎయిర్ డిఫెన్స్ వంటి సంస్థలను స్థాపించారు.అనంతరం 2008లో తన కంపెనీలన్నింటిని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మోటరోలాకు విక్రయించారు.
ఇక హురున్ గ్లోబల్ రిచ్లిస్ట్ 2021లో జే 1300 కోట్ల డాలర్ల సంపదతో భారత్లో 9వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు.కాలిఫోర్నియాలోని బే ఏరియాలో జీస్కేలర్ కంపెనీని స్ధాపించిన జేకు ఇప్పుడు ఆ కంపెనీలో 45 శాతం వాటా ఉంది.
తనకు డబ్బు కంటే ఇంటర్నెట్, క్లౌడ్ వేదికలపై వ్యాపారాన్ని అందరికీ సురక్షితంగా మలచడమే ప్రధానమని జే చౌదరి చెబుతుంటారు.ఇదే తన విజయానికి కీలకమని తాను భావిస్తుంటానని ఆయన పేర్కొన్నారు.
శాకాహారాన్ని అమితంగా ఇష్టపడే జే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.వాకింగ్, ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి చూపుతారు.
వీలు కుదిరినప్పుడల్లా చరిత్ర, అంతర్జాతీయ రాజకీయాలు, సైకాలజీ వంటి అంశాలపై పుస్తకాలను చదువుతుంటారు.