మన దేశంలో నేటికీ చాలా కుటుంబాలలో అమ్మాయిని అబ్బాయిని వేరుగా చూస్తారు.అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని, అమ్మాయిలను పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుందని భావించే తల్లిదండ్రులు ఉన్నారు.
దీంతో చాలా మంది అమ్మాయిల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఉన్నత లక్ష్యాలను సాధించాలని అనుకున్నప్పటికీ సాధించలేక వాళ్లు ఇంటికే పరితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఒక యువతి మాత్రం తను కన్న కలలను సాధించడం కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది.ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తామని చెబితే తనకు పెళ్లి వద్దని పారిపోయి ఏడు సంవత్సరాల తర్వాత కలెక్టరై తిరిగొచ్చింది.
ఏడేళ్లలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ భరించి విజేతగా నిలిచి నేటి యువతలో స్పూర్తి నింపింది.పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజు రాణి తల్లి 2013 లో అనారోగ్యంతో చనిపోయింది.
దీంతో సంజు రాణి తండ్రి పెళ్లి చేస్తే కూతురు బాధ్యత తీరిపోతుందని భావించాడు.అయితే తండ్రి నిర్ణయం సంజుకు నచ్చలేదు.
పెళ్లి చేసుకుంటే తాను కన్న కలలు నెరవేరవని ఆమె భావించింది.ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయింది.
అప్పటికే డిగ్రీ చదివిన సంజు పీజీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసి కలెక్టర్ గా ఎంపికైంది.
ఇంటి నుంచి పారిపోయిన తరువాత సంజు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడింది.
ట్యూషన్లు చెప్పి చిన్నచిన్న ఉద్యోగాలు చేసి చివరకు అనుకున్నది సాధించింది.సంజు మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్రం ఇస్తేనే వారి భవిష్యత్ బాగుంటుందని… పెళ్లి పేరుతో ఒత్తిడి చేయడం మానేయాలని పేర్కొంది.
ఇంటి నుంచి పారిపోయిన సంజు కలెక్టరై తిరిగి రావడంతో అప్పుడు ఆమెను తిట్టిన వాళ్లే ప్రశంసిస్తున్నారు.