ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సమానంగా టీడీపీకి అనుకూలంగా కొన్ని మీడియా చానళ్ళు, పత్రికలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, అడుగడుగున ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ, ప్రతిపక్ష పత్రంలో ఉంటూ వస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు.
ఈ నేపధ్యంలో వైసీపీకి సదరు మీడియా సంస్థల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.పరోక్షంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పరిస్థితి నుంచి డైరెక్ట్ గానే విమర్శలు చేసుకునే స్థాయికి వైసిపి సదరు మీడియా సంస్థలు వచ్చాయి.
అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.సదరు మీడియా సంస్థల పైన అదే రేంజ్ లో విరుచుకుపడుతూ ప్రభుత్వపరంగా ఇచ్చే యాడ్ ల విషయంలోనూ కోతలు పెడుతూ వస్తోంది.
మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కి బలమైన వాయిస్ ఇస్తూ వస్తున్న సదరు మీడియా వైఖరిలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో సదరు మీడియా సంస్థలకు ప్రకటనల రూపంలో భారీ ఎత్తున ప్రకటనలు వచ్చాయి.
దీని కారణంగానే వారు ఎక్కువగా చంద్రబాబును, టీడీపీని కీర్తిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ జోరు ఎక్కువగా ఉండడం, టీడీపీ కీలక నాయకులు అంతా ఆ పార్టీకి దూరం అవ్వడం, ఇక తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు తర్వాత ఎవరికి దక్కుతాయో క్లారిటీ లేకపోవడం, మొత్తంగా ఆ పార్టీ భవిష్యత్తు పై మీడియా సంస్థలకు అనుమానం కలగడంతో ఇక ఎక్కువ కాలం టిడిపి కి అనుకూలంగా ఉంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కొద్ది రోజులుగా తమ వైఖరిని మార్చుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.
దీనిలో భాగంగానే జగన్ దూరద్రుష్టి కలిగిన నాయకుడని, జగన్ ఏపీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారని, కరోనా సమయంలో జగన్ అందరికంటే భిన్నంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారని, తెలివైన రాజకీయ నాయకుడు అని, జగన్ తాను నమ్మిన దానికి కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఇలా అదేపనిగా కొద్ది రోజులుగా టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది.ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.అకస్మాత్తుగా ఈ విధంగా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలు ఏంటో అంతుపట్టని విధంగా ఉంది.అయితే ఎక్కువ కాలం చంద్రబాబుతో ఉంటే మునిగిపోతున్న భయం, బెంగ వారిలో ఎక్కువ కనిపించడమే కారణంగా తెలుస్తోంది.
ముందు ముందు కాలంలో జగన్ మరింతగా బలపడే అవకాశాలు ఉండడంతో, దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా చూసినా జగన్ తో వైరం పెట్టుకోవడం కంటే, కాస్త అనుకూలంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తే మంచిది అన్నట్లుగా సదరు మీడియా సంస్థలు మనసు మార్చుకున్నట్లు రాజకీయ, జర్నలిస్టుల సర్కిళ్లలో జరుగుతున్న చర్చ.