ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా పుణ్యక్షేత్రాలు మూతబడిన విషయం అందరికీ తెలిసిందే.దాదాపు 165 రోజుల తర్వాత మధురైలో మూతపడిన మీనాక్షి అమ్మన్ ఆలయం మంగళవారం రీఓపెన్ అయింది.
ఆలయం తెరుచుకోవడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.అయితే భక్తుల తాకిడి అధికంగా ఉన్న తరుణంలో ఆలయ సిబ్బంది భక్తులను ఆలయ ముఖద్వారం వద్ద థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేయించారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా జాగ్రత్తలు పాటించారు.పటిష్ట బందోబస్తుతో ఆలయంలో సామాజిక దూరం పాటించే విధంగా లైన్లు గీసి దర్శనానికి అనుమతించారు.
అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.పుణ్యక్షేత్రం తెరుచుకోవడంతో భక్తుల తాకిడి అధికంగా ఉందని గ్రహించిన ఆలయ సిబ్బంది కరోనా నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ఈ మేరకు 10 ఏళ్లలోపు ఉన్న చిన్న పిల్లలను, 60 ఏళ్లు పైబడిన ముసలివాళ్లను ఆలయంలోకి అనుమతించలేదు.ఆలయంలో ఎలాంటి ఆహార పదార్థాలు కానీ, ప్రసాదాలు అందించడం జరగదన్నారు.
భక్తులు కూడా అమ్మవారికి పూలు, పండ్లు, కొబ్బరి కాయలు, దండలు ఆలయంలోకి తీసుకోరావడానికి అనుమతి లేదన్నారు.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తేనే ఆలయంలో అనుమతి ఉంటుందని ఆలయ సిబ్బంది హెచ్చరించారు.