భూమి లోపల జరిగే రకరకాల మార్పుల కారణంగా కొన్ని వింత నిర్మాణాలు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి.ఒక్కోసారి భూకంపాలు వచ్చి భూమి రెండుగా చీలిపోతుంది.
అయితే తాజాగా ఒక కొత్త నిర్మాణం ప్రత్యక్షమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.ఇటీవల చిలీలో ఒక సింక్హోల్ ఏర్పడింది.
ఇది చూసేందుకు చాలా వింతగా, ఆశ్చర్య పరిచేలా కనిపించింది.ఈ సింక్హోల్ ఎలా ఏర్పడిందో తెలియదు కానీ దీని లోతు మాత్రం ఏకంగా 656 అడుగులు ఉంది.
అంటే ఈ గొయ్యి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ అత్యంత లోతైన గుంత టియెర్రా అమరిల్లా అనే మైనింగ్ పట్టణంలో అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది.
ఈ సింక్హోల్ ఇంకా పెద్దదిగా మారొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఈ అద్భుతమైన భూ నిర్మాణంపై చిలీ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తును ఆరంభించింది.
ఈ గుంత వ్యాసం దాదాపు 82 అడుగుల వెడల్పు ఉంటుందని నేషనల్ జియాలజీ అండ్ మైనింగ్ సర్వీస్ అంచనా వేసింది.కెనడాకు చెందిన ఓ సంస్థ లుండిన్ మైనింగ్ను అల్కాపరోసా గనిలో చేపట్టింది.
ఈ గనికి అతి సమీపాన ఉన్న టియెర్రా అమరిల్లా మునిసిపాలిటీలో ఈ గుంత దానంతటదే ఏర్పడి స్థానికులను అబ్బురపరిచింది.అయితే ఇందులో పడితే ప్రాణాలు పోవడం ఖాయం.
కాబట్టి అలాంటి ప్రమాదాలు ఏవీ చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందస్తుగానే ఈ సింక్హోల్ చుట్టూ 100 మీటర్ల గోడను నిర్మించింది.
శాంటియాగోకు ఉత్తర దిక్కున 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో ఈ సింక్హోల్ దర్శనమిచ్చింది.మళ్లీ ఎక్కడైనా ఇలాంటి గుంతలు సడన్ గా వస్తే అక్కడ పనిచేసే వారు అందులో పడి చనిపోయే అవకాశం ఉంది.అందుకే నివారణ చర్యగా అల్కాపరోసా భూగర్భ గనిలో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా వెలుగొందుతోంది.ప్రపంచ సరఫరాలో నాలుగింట ఒక వంతు ఈ దేశం నుంచే రాగి వస్తుంది.