అసలు ఈ ప్రపంచానికి ఏమైంది.ఒకవైపు కోవిడ్, మరోవైపు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఒక్కసారిగా అటాక్ చేస్తున్నాయి.
జన జీవనాన్ని ఆగమ్య గోచరంగా మారుస్తున్నాయి.ఇప్పటికే ప్రకృతి సృష్టిస్తున్న ప్రళయాల ముందు ఓడిపోతున్న మానవుడు ఇకనైన తన పద్దతి మార్చుకుని ప్రకృతి నియమాలకు అనుకూలంగా జీవిస్తే గానీ ముందుతరాల భవిష్యత్తుకు ఢోకా ఉండదట.
కానీ అభివృద్ధి అంటూ పరిగెత్తే మానవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడం మాత్రం అంత సులువు కాదు.అందుకే ఇలాంటి భయంకరమైన ఫలితాలు అనుభవించ వలసిందే.
ఇకపోతే ఈ ఉదయం జపాన్ ఈశాన్య తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించిందట.కాగా మియాగీలోని ఇషినోమకి వద్ద పసిఫిక్ సముద్రంలో 47 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) గుర్తించింది.
ఈమేరకు తూర్పు తీరంతో పాటు టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు కనిపించినట్లుగా పేర్కొంది.
కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని తెలిపింది.అయితే 2011లో ఈ ప్రాంతానికి సమీపంలో సంభవించిన భూకంపం కారణంగా సుమారుగా 18 వేల మంది మృత్యువాత పడ్డారని, ప్రస్తుతం వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ముప్పు లేదని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
కానీ ఈ భూకంపం వల్ల స్థానిక రైల్వే మాత్రం బుల్లెట్ రైలుతో సహా పలు సర్వీసులను నిలిపివేసినట్లు వెల్లడించింది.