గృహ నిర్మాణ పనులు చేపడుతుండగా భారీ పేలుడు సంభవించింది.దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సెల్లార్ లో గుంతలు తవ్వుతుండగా అడ్డుగా వచ్చిన రాళ్లను పగులగొట్టేందుకు నిర్వాహకులు బ్లాస్టింగ్ నిర్వహించారు.గురువారం జరిగిన ఈ పేలుడు ప్రక్రియలో రాళ్ల శకలాలు కిలో మీటర్ మేర చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
ఆస్తి నష్టం జరిగింది.
హైదరాబాద్ లోని బాచుపల్లి నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారిలో భారీ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, శ్రీ చైతన్య బాలికల వసతి గృహం మధ్య ఉన్న ఖాళీ స్థలంలో భారీ భవన నిర్మాణ పనులు చేపట్టారు.సెల్లార్ నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా అడ్డుగా రాళ్లు రావడంతో బాస్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
బ్లాస్టింగ్ చేపట్టేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి రాలేదు.గురువారం సంస్థ పేలుడు ప్రక్రియను చేపట్టింది.భారీ పేలుడు సంభవించడంతో బండరాళ్లు స్థానిక ప్రాంతాల్లో నిలిచిన వాహనాలపై పడ్డాయి.దుకాణాలు, మూడు బస్సుల అద్దాలు, రెండు షెడ్ల పైకప్పులు, వసతి గృహ గోడలు, కిటికీలు, ఓ కారు, ట్రాలీ ఆటోలపై బండరాళ్లు పడ్డాయి.సుమారు రూ.1.50 లక్షల విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయని యజమాని పేర్కొన్నాడు.