భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించి ఆరు నెలలు దాటినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.దేశంలో గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించడం ద్వారా మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది.కరోనా నిబంధనలు అమలు కావడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
అయితే మన దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నా ఇతర దేశాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.పలు దేశాల్లో కరోనా నిబంధనలు పాటించని వాళ్లకు భారీ జరిమానాలు విధిస్తుండగా మరికొన్ని చోట్ల మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉండటం గమనార్హం.
ఇండోనేషియా దేశంలోని తూర్పు జావా ప్రాంతంలోని స్థానిక అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తూ వింత శిక్షలు విధిస్తున్నారు.
మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారితో అధికారులు సమాధులు తవ్విస్తున్నారు.
అధికారులు మాస్కులు ధరించని ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకి మరణించిన వారి కోసం సమాధులు తవ్వించడం గమనార్హం.సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వింత శిక్షను అమలు చేయడానికి ప్రత్యేకమైన కారణమే ఉందని తెలిపారు.
ఈ ప్రాంతంలో సమాధులు తవ్వేందుకు తక్కువ మంది అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
అయితే అధికారులు తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.
ఒక సమాధి తవ్వడానికి ఇద్దరు అవసరమని మాస్క్ ధరించని వారిలో ఒకరికి సమాధి తవ్వే బాధ్యతను, మరొకరికి చెక్క బోర్డు పెట్టే బాధ్యతను అప్పగిస్తున్నామని అధికారులు తెలిపారు.ఈ నిబంధనల వల్ల ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తున్నారని పేర్కొన్నారు.