ఇష్టం లేని పెళ్లి చేసుకుని మరుసటి రోజు ప్రియుడి దగ్గరికి వెళ్లింది.భర్త కట్టిన తాళిని తీసేసి ప్రియుడు కట్టిన తాళితో పోలీసుల ముందు హాజరైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మొదటి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కడప జిల్లా పుల్లంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి తన అక్క కూతురితో వివాహం నిశ్చయమైంది.ఆగస్టు 15వ తేదీన వీరిద్దరికీ పెళ్లి జరిగింది.
అయితే ఆ యువతి ఆదివారం సాయంత్రం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను సంప్రదించినా ఆమె ఆచూకీ లభించలేదు.దీంతో పెళ్లికొడుకు (మేనమామ) స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.మరుసటి రోజు ఆ పెళ్లికూతురు ప్రియుడితో పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.
ఇష్టం లేని పెళ్లి చేశారని, ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నానని పోలీసులకు చెప్పడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు పిలిపించారు.మేనమామ కట్టిన తాళిని తెంచేసి ప్రియుడు కట్టిన తాళి వేసుకోవడంతో కుటుంబ సభ్యులందరూ షాక్ కి గురయ్యారు.
పెళ్లి కూతురు మేజర్ కావడంతో ఎవరితో ఉండాలనే విషయంపై ఆమెకే అవకాశం ఇచ్చారు.దీంతో ఆమె ప్రియుడితో కలిసి ఉంటానని తెగేసి చెప్పింది.దీంతో ఆ సమస్య అక్కడితో సద్దుమణిగింది.కానీ, ఈ విషయం ఊరంతా తెలవడంతో మొదటి పెళ్లి కొడుకు (మేనమామ)ను చూసి ‘వీడి పెళ్లాం లేచిపోయింది’ అంటూ కొందరు ఎగతాళి చేయడంతో అతడు తట్టుకోలేక పోయాడు.
ఆత్మహత్యకు పాల్పడుతుండగా బంధువులు అతడిని కాపాడారు.