మనిషి జీవితంలో పెళ్లి పిల్లలు అనేవి చాలా ముఖ్యమైన ఘట్టాలు అంటారు.ముఖ్యంగా మహిళలకు వివాహం తర్వాత అమ్మ అనిపించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు.
పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఇరుగు పొరుగు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం చాలా మంది మహిళలు తట్టుకోలేరు.ఇటు బంధువులు, అటు బయట సమాజం లో గొడ్రాలు అని ముద్రవేస్తారు.
ఆ సూటిపోటి మాటల భరించలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కొంత మంది అత్తింటి వారిచేత గృహ హింసలకు గురవుతుంటే కొంతమంది ఆత్మహత్యే శరణ్యం అనుకోని చనిపోతున్నారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్లి అయ్యి ఎన్నో ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదనే మనస్తాపం తో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా కూడేరు మండలం లోని పి.నాగిరెడ్డిపల్లికి చెందిన వివాహిత సరస్వతి (34) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.గ్రామానికి చెందిన రాగే శ్రీరాముల తో సరస్వతి కి 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. పిల్లలు కలగలేదని సరస్వతి నిత్యం బాధపడుతూ ఉండేది.
ఎన్నో హాస్పిటల్ లు తిరిగినా సంతానం మాత్రం కలుగ లేదు.ఈ క్రమంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల కు ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది.తర్వాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది.విషయాన్ని గమనించిన ఆమె భర్త శ్రీరాములు వెంటనే ఆమెను అనంతపురం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.వైద్యులు ఆమెని పరీక్షించారు.కానీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
భర్త శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.