కార్తీక మాసం అంటే ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన నెల.ఈ మాసం అంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది.
ప్రతి ఇల్లు దీప కాంతులతో దేవాలయాన్ని తలపిస్తాయి.ఈ కార్తీకమాసంలో వ్రతాలు, నోములు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటివాటితో ఈ నెలంతా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
కరోనా సమయంలో పెళ్లిళ్లకు కేవలం 20 మంది వరకు మాత్రమే అనుమతి ఉండేది.కానీ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న ప్రజలు పెళ్లిళ్లకు పూర్వవైభవం తెస్తున్నారు.
కార్తీక మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.జనవరి 6 దాక పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ, కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కావడంతో పెళ్లిళ్లు చేయడానికి ఎంతో ఆరాటపడుతున్నారు.
అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో పుష్యమాసం లో గురు మూడం ఉండటంవల్ల మాఘమాసం మొదలవడంతో కూడా పెళ్లిళ్లు ముహూర్తాలు లేవు, దాదాపుగా పెళ్లిళ్లు చేయడానికి ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడం వల్ల పెళ్లిళ్లు జరపడానికి కార్తీక మాసంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అంతేకాకుండా కార్తీక మాసంలో నూతన గృహ ప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలకు ఎంతో పవిత్రమైనది.
ఇటువంటి శుభకార్యాలను ఎక్కువగా కార్తీకమాసంలో నిర్వహిస్తారు.ఈ నెలంతా ప్రతి ఇంటి నందు సంధ్యా సమయంలో కార్తీక దీపాలను వెలిగించి, ఆ శివుని అనుగ్రహం పొందుతారు.
అంతేకాకుండా కార్తీక సోమవారం అంటే ఆ శివునికి ఎంతో ప్రీతికరమైనది కావడంతో, సోమవార వ్రతం నిర్వహించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసమంతా తెల్లవారుజామున చన్నీటి స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని ఉపవాస దీక్షలతో పూజించడం వల్ల అంతా శుభం జరగడమే కాకుండా, కోరిన కోరికలు నెరవేరుతాయి.
అలాగే ప్రతిరోజు సాయంత్రం కార్తీక దీపాలను నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.