భార్య నుంచి భర్త విడాకులు కోరాడు అంటే అందుకు బలమైన కారణం ఉంటుంది అని అంటారు.భార్య సరిగా నడుచుకోవడం లేదనో,లేదంటే ప్రతి దానికి గొడవ పడుతుందో ఇలా ఇబ్బందికర అంశాలు చాలానే ఉంటాయి.
పలు కారణాల రీత్యా భార్య,భర్తలు అనేవారు విడిపోతూ ఉంటారు.అయితే గౌహతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం భార్య కేవలం ముఖానికి బొట్టు,కాళ్ల కు మెట్టెలు పెట్టుకోలేదు అన్న కారణం తో భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టు ను ఆశ్రయించాడు.
దీనితో ఈ కేసును విచారించిన గౌహతి హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ఫ్యామిలీ కోర్టు, విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించగా, బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు.
దీనితో కేసు ను విచారించిన హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
హిందూ మహిళ, వివాహం తరువాత ముఖానికి సిందూరం, కాళ్లకు మెట్టలు ధరించడం సంప్రదాయమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమని, భర్త మనోభావాలను గౌరవించాలని, ఆ పని చేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడుతూ బాధితుడికి విడాకులు మంజూరు చేయడం గమనార్హం.“కుంకుమ, మెట్టలు ధరించేందుకు ఇష్టపడటం లేదంటే, తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోంది.ఆమె పెళ్లిని అంగీకరించినట్టుగా అనిపించడం లేదు.
వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉంది” అంటూ హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.
కాగా, వీరిద్దరికీ 2012 ఫిబ్రవరి 17న వివాహం జరుగగా, ఆపై కొంతకాలానికే విభేదాలు వచ్చాయి.
భర్త తరఫు కుటుంబీకులతో కలిసి నివసించేందుకు ఆమె అంగీకరించలేదు.ఆపై 2013, జూన్ 30 నుంచి వారిద్దరూ విడిగానే ఉంటున్నారు.
భర్తపై ఆమె గృహహింస కేసు కూడా పెట్టింది.ఆపై వివాహమైనట్టుగా ప్రపంచానికి తెలిపే కుంకుమ, మెట్టెలు కూడా తీసేసేయడం తో భర్త కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నాడు
.