ముక్కోటి దేవతలలో వినాయకుడికి ఎంతో ప్రత్యేకత ఉంది.ప్రథమ పూజ్యుడిగా తొలి పూజ వినాయకుడికి చేయటం ద్వారా మనపై ఉన్న విఘ్నాలను తొలగిస్తాడు.
అందుకోసమే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించడం వల్ల ఎటువంటి ఆటంకాలు కలుగకుండా శుభ కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయని భావిస్తారు.ఇకపోతే వినాయకుడిని పూజించడం కోసం ఎన్నో వ్రతాలు ఉన్నప్పటికీ, సంకష్టహర చతుర్దశి వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు.
ఈ వ్రతం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల ఈతి బాధలు, శని గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి.అయితే ఎంతో పవిత్రమైన సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది? ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ప్రతినెలా పౌర్ణమి తరువాత వచ్చే నాలుగో రోజును సంకష్టహర చతుర్థి అంటారు.ఆ రోజున వినాయకుడికి పూజ చేసి వ్రతమాచరించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.అదేవిధంగా ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్దశి రోజున ఆలయాలలో వినాయకుడి పూజలో పాల్గొనటం వల్ల కుటుంబంలో కలిగే విఘ్నాలు తొలగి పోయి సకల సంతోషాలతో నిండి ఉంటారు.
మన ఇంట్లో శుభకార్యాలు, కోరిన కోరికలు నెరవేరుతాయి.సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు.ఏలినాటి శని దోషాలతో బాధపడేవారికి శని దోష నివారణ జరుగుతుంది.
సంకష్టహర చతుర్దశి రోజు ఉదయమే స్నానమాచరించి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని పగలంతా ఉపవాసం దీక్షలు చేస్తూ సాయంత్రం వినాయకుడికి వ్రతం ఆచరించాలి.స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహిస్తారు.పూజ సమయంలో స్వామి వారికి తప్పకుండా తెల్లజిల్లేడుమాల, గరిక సమర్పించి పూజ చేయాలి.
అదేవిధంగా స్వామివారికి బెల్లంతో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి సకల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తుల నమ్మకం.