తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఇంకా ముగియకపోవడంతో, అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.అసలు కేసీఆర్ ఇన్ని రోజులు కేంద్ర బిజెపి పెద్దలను మాత్రమే కలిసేందుకు తన షెడ్యూల్ కేటాయించారు అనేది అందరిలోనూ అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి.
సెప్టెంబర్ ఒకటో తేదీన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు.టిఆర్ఎస్ కార్యాలయం భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం లో రెండో తేదీన పాల్గొన్నారు.
ఇక తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఇక ఆ తర్వాత రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశాన్ని నిర్వహించారు.
ఇక ఆ తరువాత వరుసగా కేంద్రమంత్రులను కలుస్తూ కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు.తెలంగాణకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించే వరుసగా మంత్రులను కలుస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోనూ ఆయన భేటీ అయ్యారు.తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు.అలాగే కృష్ణ, గోదావరి బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ పైన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఒకపక్క తెలంగాణలో టిఆర్ఎస్ – బిజెపి మధ్య పోటీ వాతావరణం నెలకొన్న సమయంలో ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ ఉన్న సమయంలోనే, కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు , కేంద్ర బిజెపి పెద్దలను కలవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కేసీఆర్ కేవలం బిజెపి పెద్దలతో మాత్రమే భేటీ కావడం లేదని, రహస్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై చాకచక్యంగా పావులు కదుపుతున్నారు అని, జాతీయస్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను బలపరచి జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలనే వ్యూహంతోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ను వాడుకుంటున్నట్టు గా కనిపిస్తున్నారు.
వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులతోనూ రహస్యంగా కేసీఆర్ సమావేశం అవుతూ, ఫెడరల్ ఫ్రంట్ లోకి వచ్చే విధంగా ఒప్పించినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసే ఉద్దేశం వెనుక అసలు కారణం ఇదేనని, అందుకే ఇన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని ఎత్తుగడలు వేస్తున్నారని, అలాగే 2023 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలోనూ కేంద్ర బిజెపి పెద్దలతో మంతనాలు చేస్తూ , తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.