గత కొద్ది రోజులుగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కేంద్ర అధికార పార్టీ బిజెపి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి ఎదుగుతున్న తీరు టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది.
దీనికితోడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు తమనే టార్గెట్ చేసుకుంటూ వ్యవహరిస్తున్న తీరు కెసిఆర్ కు మరింత కంగారు పెట్టిస్తున్నాయి .ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఈరోజు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు.గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం హోదాలో కెసిఆర్ హాజరు కాలేదు.
పోనీ సీనియర్ మంత్రులను ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడకపోవడం పైన ఇప్పుడు వివాదం నడుస్తోంది.
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండా ఎగురవేశారు.
గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకలకు తప్పనిసరిగా సాంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంటుంది.అయితే కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
దీంతో అధికారులతోనే గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ముగించారు.దీంతో అసలు కెసిఆర్ గవర్నర్ కార్యాలయానికి ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ విషయంలో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. అదే గవర్నర్ గా నరసింహన్ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ? కేసీఆర్ ముందు గానే ఈ వేడుకలకు హాజరై ఉండేవారని ఇప్పుడు హాజరుకాకుండా సాంప్రదాయాన్ని మంట కలపడమే కాక , గవర్నర్ ను అవమానించారని తప్పు పడుతున్నారు.
రాబోయే రోజుల్లో గవర్నర్ కు ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల అంశాన్ని ప్రస్తావించలేదు.కరోనా ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ఆమె మాట్లాడారు.ఈ వ్యవహారంలో బిజెపి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల దాడి పెంచారు.
అసలు గవర్నర్ కు రాజకీయాలకు సంబంధం లేకపోయినా, కెసిఆర్ ఈ వేడుకలకు హాజరు కాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని బిజెపి విమర్శలు చేస్తోంది.అయితే కేసీఆర్ మాత్రం ఈ వ్యవహారం పెద్దగా పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారు.