అవసరమైన పని నిమిత్తం డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకుకు వెళ్లి అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రజలు.కానీ, అక్కడ సవాలక్ష కండిషన్స్, షూరిటీలు ఉంటే రిస్క్ గానే ఉంటుంది.
ఒకవేళ అన్ని కండిషన్స్ క్లియర్ చేసినా సమయానికి డబ్బులు అందే సందర్భాలు తక్కువగానే ఉంటాయి.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలామంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
కాగా, వ్యాపారులు ముక్కు పిండి మరీ డబ్బలు వసూలు చేస్తున్నారు.దాంతో బాధితులు గగ్గోలు పెట్టడమే కాకుండా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.
తాజాగా అలాంటి విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.వివరాల్లోకెళితే.
నిజామాబాద్ సిటీకి చెందిన నాగులు అనే వ్యక్తి ఇటీవల వడ్డీ వ్యాపారి వద్ద ఓ పని విషయమై డబ్బు అప్పుగా తీసుకున్నాడు.ఈ క్రమంలోనే తిరిగి సమయానికి చెల్లిస్తానని చెప్పాడు.
కానీ, డబ్బు తిరిగి చెల్లించలేకపోయాడు.
దాంతో డబ్బు కోసం సదరు వడ్డీ వ్యాపారి నాగులు ఇంటి ముందు గొడవ చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే నాగులు పరువు పోకూడదని భావించిన నాగులు వైఫ్ తన మెడలో ఉన్న పుస్తెల తాడు తీసి అతడికి ఇచ్చింది.అంతటితో సమస్య తీరిపోయిందని భావించింది.
కానీ, ఆమె భర్త నాగులు దాన్ని అవమానంగా భావిస్తాడని ఊహించలేదు.కానీ, అదే పని జరిగింది.
భార్య పుస్తెలు కాపాడలేకపోయానని భావించిన నాగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకున్నాడు.ఈ మేరకు నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.నాగులు వడ్డీ వ్యాపారి వద్ద గతంలో రూ.1,50,000 అప్పు తీసుకున్నట్లు భార్య పేర్కొంది.మాయదారి వడ్డీ డబ్బు తీసుకోవడం వల్లే తన భర్త మరణించాడని ఆమె వాపోయింది.వడ్డీ వ్యాపారులు మానవత్వమనేది లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆమె పేర్కొంది.ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె కోరింది.సదరు వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.