రెండు తెలుగు రాష్ట్రాలలో మందకృష్ణ మాదిగా అంటే తెలియని వారు ఉండరు.మాదిగ కులానికి నాయకుడుగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరుపున వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉంది.
మాదిగా సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీకి మద్దతుగా గతంలో అతను నిలబడే వారు.అయితే ఇప్పుడు మహాజన్ సోషలిస్ట్ పార్టీ పేరుతో ఒక బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఒక పార్టీ పెట్టి తన పోరాటాన్ని రాజకీయ పంథాలోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే రానున్న 2023 ఎన్నికలలో రాజ్యాధికారం తమదే అని, తెలంగాణలో కేసీఆర్ కి నేనే ప్రత్యామ్నాయం అని మందకృష్ణ మాదిగ అంటున్నారు.వరంగల్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతను విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
పేదల ప్రాణాలను గాలికొదిలి, పేదల భూములను రాబందుల్లా లాక్కుంటున్న దొరల పాలనకు 2023లో స్వస్తి చెప్పి మహాజన రాజ్యాన్ని సాధిస్తామని చెప్పారు.ఎన్నికలకు మూడేళ్ల ముందే కేసీఆర్ సాగిస్తున్న దొరల పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.దళిత ముఖ్యమంత్రి హామీ విషయంలో తిరుగుబాటు రాకుండా 2014లో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి మభ్య పెట్టిన కేసీఆర్ 2018 నాటికి ఆ ఊసే లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని దయ్యబట్టారు.30 లక్షల ఎకరాల భూపంపిణీ చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ హామీ నిలుపుకోకుండానే పేదలకు చెందిన లక్ష ఎకరాల భూములు లాక్కున్నారని మందకృష్ణ అన్నారు.ఈ రాష్ట్రంలో 2023లో దొరల పాలనకు స్వస్తి పలుకుతామన్నారు.వరంగల్ను శాసన రాజధానిగా చేసుకుని భవిష్యత్తులో అద్భుత పాలనకు శ్రీకారం చుడతామన్నారు.కేసీఆర్ కి తెలంగాణలో తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేరని, అతనిని ఎదుర్కొనే దమ్ము తనకే ఉందని ఈ సందర్భంగా మందకృష్ణ ప్రస్తావించారు.