ప్రస్తుతం టీటీడీ ఆస్తుల విక్రయం వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.జాతీయ స్థాయిలో హిందుత్వ వాదులు, ఇతర పార్టీల వారు, స్వామీజీలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు.
ఈ విషయంలో ఇప్పటికే ప్రజాగ్రహం ఎదురవుతుందని గమనించిన టీటీడీ భూముల అమ్మకంపై వెనక్కి తగ్గే ప్రయత్నం చేసింది.ఇదిలా ఉంటే శ్రీవారి ఆస్తుల విక్రయం అంశం పై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు.
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అంటూ టీటీడీని సూటిగా ప్రశ్నించారు.శ్రీవారికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేది, చేసేది టీటీడీయేనని స్పష్టం చేశారు.
సుప్రభాత సేవకు వేళయింది అని ఆ శ్రీహరిని, కొండకు వచ్చిన లక్షలమంది భక్తులను అందరినీ కంట్రోల్ చేసేది టీటీడీనే.అలాంటిది, వడ్డీకాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవింద నామస్మరణ చేసే నా గొంతు తడబడింది.అయితే, మోసం జరగట్లేదని తెలుసు.ఇన్ సైడర్ ట్రేడింగ్ లా కాకుండా అందరు చూస్తుండగా వేలం వేసి అమ్ముతారు.కానీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే అంశంపై పాలకమండలి వివరణ ఇస్తే బాగుంటుంది.వివరణ తప్ప మరేమీ కోరడంలేదు, ఎందుకంటే, ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడ్ని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.