కరోనా వైరస్ విస్తరించకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయతే ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది నిర్లక్ష్యంగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు.
ఏ మాత్రం బాద్యతలేకుండా తిరుగుతూ పోలీసుల మీద కూడా దాడులు చేసిన ఘటనలు కొన్ని చోట్ల కనిపించాయి.అయితే లాక్ డౌన్ ని కఠినంగా అమలుచేయాలని భావించిన ప్రభుత్వం దానిని అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జైలు శిక్ష కూడా విధించడానికి ఉత్తర్వులు జరీ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ భర్తపై భార్య పోలీసులకి ఫిర్యాదు చేసింది.లాక్ డౌన్ అతిక్రమించి బయట తిరుగుతున్న తన భర్తని అరెస్ట్ చేయాలని పోలీసులని కోరింది.
ఈ ఘటన కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం జిల్లాలోని మువత్తుప్పుజాలో జరిగింది.లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్న తన భర్త బైక్ నంబర్ తో సహా పోలీసులకి ఫిర్యాదు చేసింది.
తన భర్తపై కేసు నమోదు చేసి తగిన శిక్ష వేయాలని తెలిపింది.అయితే భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలని భావించిన పోలీసులు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరారు.
కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు.లాక్ డౌన్ ను లెక్కచేయకుండా బైక్ వేసుకుని తిరిగేస్తున్న తన భర్త వల్ల తన కుటుంబానికి పిల్లలకు తనకు ఏం హాని జరుగుతుందో అని భయంగా ఉందని, పలు మార్లు భర్తకు నచ్చజెప్పినా ఆయన వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ మహిళా చెప్తుంది.
ఆయనతో మా కుటుంబానికి కూడా ప్రమాదమే అని ఆ మహిళ పోలీసులకి తెలియజేసింది.ఇక తప్పని పరిస్థితిలో భార్య ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.