మహాభారతంలో ధర్మరాజు గురించి అందరికి తెలిసే ఉంటుంది.ఏ విషయంలోనూ అబద్దం ఆడని వ్యక్తి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి, ఇతరుల సొమ్మును తీసుకోవాలనే ఆశలేని వ్యక్తి.
ఇలాంటి వ్యక్తులు మనకు ఇప్పుడు కనిపించడం అంటే సాధ్యం కాదు.పూర్వ కాలంలో కూడా ఎక్కడో ఒక్కరు ఇద్దరు ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండేవారు.
కాని ఇప్పుడు కనుచూపు మేరలో కాదు ఈ భూమిమీద ఎంత వెదికినా కూడా అలాంటి ధర్మరాజులు కనిపించరని నిన్న మొన్నటి వరకు నేను మీరు అనుకునేవాళ్లం.కాని ఇటీవల అమెరికాలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ సంఘటన తెలిసిన తర్వాత ధర్మరాజు ఈసారి అమెరికాలో పుట్టినట్లుగా ఉన్నాడనిపిస్తుంది.నా మాట నమ్మశక్యంగా లేదు అనుకుంటే మీరు ఈ కథనంను చదవండి. అమెరికా మిచిగాన్కు చెందిన హోవార్డ్ కిర్బీ అనే వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం ఒక సెకండ్ హ్యాండ్ సోఫాను కొనుగోలు చేశాడు.ఆ సోఫాను తక్కువ మొత్తానికే కొనుగోలు చేసిన హోవార్డ్ దానికి చిన్న చిన్న రిపేర్లు చేసేందుకు సిద్దం అయ్యాడు.ఆ క్రమంలో అతడికి సోఫాలో ఏకంగా 43 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 30.6 లక్షల రూపాయలు కనిపించాయి.సోఫాలో డబ్బు కనిపించగానే ఆశ్చర్యపోయిన హోవార్డ్ దాన్ని బయటకు తీసి భద్రపర్చి సోఫాను రిపేర్ పూర్తి చేశాడు.ఆ తర్వాత తాను ఎక్కడైతే సోఫాను కొనుగోలు చేశాడో అక్కడకు వెళ్లి ఆ సోఫాను ఎవరి వద్ద నుండి కొనుగోలు చేశారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు.
ఆ సోఫాను సెకండ్ హ్యాండ్ షాపు వారు కిమ్ ఫాత్ అనే మహిళ వద్ద కొనుగోలు చేసినట్లుగా హోవార్డ్ తెలుసుకున్నాడు.వెంటనే కిమ్ ఫాత్ వద్దకు వెళ్లిన హోవార్డ్ విషయాన్ని చెప్పాడు.కిమ్ ఫాత్ ఆ సోఫా తన తాతగారిది అని, ఆయన ఇటీవలే మరణించడంతో ఆ సోఫాను కాల్చేయాలని అనుకున్నాం.కాని సెకండ్ హ్యాండ్ సోఫా షాప్ వారు దాన్ని కొనుగోలు చేస్తామని ముందుకు రావడంతో తక్కువ మొత్తానికే అయినా అమ్మేసినట్లుగా చెప్పింది.
ఆ సోఫాలో మా తాతగారు డబ్బు దాచి ఉంటారనే విషయం మేము ఊహించలేదు అంది.ఆ డబ్బును కిమ్ ఫాత్ కు హోవార్డ్ ఇచ్చాడు.మొదట ఆ డబ్బును స్వీకరించేందుకు కిమ్ ఫాత్ నిరాకరించినా కూడా హోవార్డ్ ఆమెను బలవంత పెట్టి మరీ ఆ డబ్బును ఇచ్చాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 వేల డాలర్లు ఊరికే దొరికితే ఉంచేసుకుని పండుగ చేసుకోకుండా ఆ డబ్బు ఓనర్ను వెదికి మరీ తన డబ్బు ఖర్చు చేసుకుని అక్కడకు వెళ్లి వారి డబ్బును ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.అమెరికాలో వంద డాలర్ల కోసం హత్యలు చేసే వారిని చూశాం.అలాంటిది ఈయన అంత మొత్తంను తిరిగి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఇప్పుడు చెప్పండి ఇతడు నిజంగా కలియుగ ధర్మరాజు కదా.?
.