ప్రజల్లో ఎన్ఆర్ఐలపై ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం బెంగళూరులో ఎన్ఆర్ఐని అని చెప్పిన ఓ మోసగాడు… వారిని బాగా నమ్మించి సుమారు రూ.70 లక్షలు దోచేసిన సంగతి తెలిసిందే.తాజాగా గుర్గావ్లో ఓ వ్యక్తి మ్యాట్రిమోని సైట్లో ఎన్ఆర్ఐనని చెప్పి ఓ మహిళను రూ.18 లక్షలు మోసం చేశాడు.
నగరానికి చెందిన బాధితురాలు పెళ్లి సంబంధాలు చూసుకునే క్రమంలో ఆమెకు గత డిసెంబర్లో మ్యాట్రిమోని సైట్లో సన్నీ అని వ్యక్తి పరిచయమయ్యాడు.
తనను లండన్లో స్థిరపడిన ప్రవాస భారతీయుడిగా చెప్పుకున్నాడు.దీంతో ఇద్దరు నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని గంటల తరబడి చాట్ చేసుకునేవారు.ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 22న తాను భారత్కు వస్తున్నట్లుగా సన్నీ ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు.
అయితే ఆ మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
తాను ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ మేనేజర్నని సన్నీ అనే వ్యక్తి తమకు లక్ష పౌండ్లతో పట్టుబడ్డాడని అతనిని విడుదల చేయాలంటే రెండు క్లియరెన్సులు అవసరమని చెప్పింది.ఇందులో ఒకటి భారత్ నుంచి, రెండోది యూకే నుంచి ఉంటుందని, ఇందుకోసం రూ.70,000.రూ.90,000 చొప్పున రెండు వేర్వేరు చెల్లింపులు చేయాలని చెప్పింది.
దీంతో భయపడిపోయిన బాధితురాలు అలాగే డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది.అయితే జనవరి 23 నుంచి 30 మధ్యకాలంలో ఇంకా డబ్బు చెల్లించాలంటూ విపరీతంగా ఫోన్లు, ఈ మెయిల్స్ రావడంతో బాధితురాలు వివిధ ఖాతాలకు రూ.18 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది.అయినప్పటికీ సన్నీ క్షేమ సమాచారం గురించి ఆమెకు ఎలాంటి వివరాలు అందకపోగా, మ్యాట్రిమోనీ సైట్లో అతని ప్రొఫైల్ డియాక్టివేట్ అయిపోయింది.దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు ఫిబ్రవరి 2న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్పందించిన పోలీసులు మార్చి 15న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.