ముంతాజ్ పై ప్రేమతో షాజహాన్ ఏకంగా తాజ్ మహల్ కట్టాడు.ప్రపంచవింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ ప్రేమకి చిహ్నం అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటాం.
అదేవిధంగా భార్యపై ప్రేమతో తన గుర్తుగా ఏకంగా గిటార్ వనాన్నే సృష్టించాడు ఒక భర్త.ఆ గిటార్ వనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?ఏమా కథా కమామిషు.చదవండి.
అర్జెంటీనాలోని పంపాకు చెందిన పెడ్రో మార్టిన్ ఉరెటా అనే వ్యక్తి కొన్ని దశాబ్దాల కిందట గిటార్ వనాన్ని రూపొందించాడు.ఈ వనం సృష్టించడం వెనుక ఒక విషాధకారణం ఉంది.మార్టిన్ అతని భార్య గ్రాసిలా ఎరిబాజ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
వారికి నలుగురు పిల్లలు.ఒకరోజు విమానం ప్రయాణం చేస్తున్న గ్రాసిలా పంపా మీదుగా వెళ్లూ ఖాళీగా ఉన్న తమ పొలాన్న గమనించింది.
తిరిగొచ్చాక భర్తతో అదే విషయాన్ని పంచుకుంది.మన పొలంలో గిటార్ రూపంలో ఒక తోట పెంచుదామని.
భార్య ఏదో సరదాకి అంటుంది అని మార్టిన్ లైట్ తీసుకున్నాడు.
తర్వాత 1977లో అనారోగ్యంతో గ్రాసిలా మరణించింది.ఎంతో ప్రేమగా చూసుకునే భార్య దూరం కావడంతో మార్టిన్ చాలా క్రుంగిపోయాడు.అప్పుడు అతనికి తన భార్య కోరిక గిటార్ వనం గుర్తొచ్చింది.
అంతే ఆలోచన వచ్చిందే తడవుగా తన నలుగురు పిల్లలతో కలిసి గిటార్ వనాన్ని సృష్టించాలని నిర్ణయం తీసుకున్నాడు.మూడు దశాబ్దాల కిందట 7వేల మొక్కలతో ఈ వనాన్ని ప్రారంభించాడు.
ఇప్పుడు ఆ వనం అందంగా ఉండి విమానప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇంతమందిని ఆకట్టుకుంటున్న ఆ వనాన్ని మార్టిన్ ఇప్పటివరకు కళ్లారా చూసుకోలేదు.
కేవలం ఫోటోల్లో మాత్రం చూసాడు.కారణం.
ఎత్తైన ప్రాంతాలన్నా,విమాన ప్రయాణాలన్నా మార్టిన్ కు భయం.ఇప్పుడు ఆయన వయస్సు 71 ఏళ్లు.