మనకు ఇష్టమైన వారు చనిపోతే వారి వర్ధంతిని నిర్వహించి నలుగురికి భోజనం పెడతాం.ఇతరుల వర్ధంతిలు, జయంతిలలో కూడా మనకు ఇదే సీన్ కనిపిస్తుంది.
కానీ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి చాలా ప్రేమగా చూసుకున్న తన పెంపుడు కుక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించాడు.ఈ వర్ధంతి వేడుకలో ఆయన భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు.
ఇంతకీ ఆ వర్ధంతి వేడుకలకు వచ్చిన అతిథులు ఎవరో తెలుసా? వీధి కుక్కలు.అవును.
మీరు చదివింది నిజమే.
రేణిగుంటకు చెందిన షేక్ ఫరీద్ బాబాకు తన పెంపుడు కుక్క స్నూపీ అంటే ప్రాణం.
కుటుంబసభ్యులకు కూడా స్నూపీ అంటే చాలా ఇష్టం.స్నూపీతో వారి అనుబంధం 13 ఏళ్లపాటు కొనసాగింద.
అయితే గతేడాది స్నూపీ చనిపోయింది.దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది.
కాగా తాజాగా స్నూపీ వర్ధంతిని పురస్కరించుకుని స్నూపీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.అనంతరం ఫరీద్ బాబా వీధుల్లో తిరుగుతూ వీధి కుక్కలకు బిర్యానీ పెట్టారు.
ఫరీద్ బాబా మాట్లాడుతూ తాము స్నూపీని ఎప్పుడు జంతువులా చూడలేదని, తమ కుటుంబంలోని వ్యక్తిలా చూశామని అన్నారు.మూగజీవాల ఆకలి తీరిస్తే స్నూపీ ఆత్మ సంతోషిస్తుందనే నమ్మకంతో తాము వీధి కుక్కలకు బిర్యానీ పెట్టామని ఫరీద్ తెలిపారు.
వారి కుక్కపై తమకున్న ప్రేమను ఇలా చూపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.