ఒక్కోసారి మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు కొందరు కర్ర సాయంతో బ్యాలన్స్ చేసుకుంటూ తాడుపై నడవడం చూసి ఉంటాం.వారు అయితే పొట్ట కూటి కోసం అలా చేస్తారు.
నాలుగు రాళ్లు సంపాదించుకుంటే పూట గడుస్తుందని వారు ఆ ప్రమాదకర స్టంట్లు చేస్తుంటారు.అయితే ప్రస్తుతం అందరిలోనూ సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది.
ఎంతంటే చివరికి ప్రాణాలతో చెలగాటం ఆడేంతగా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.బైక్పై విన్యాసాలు చేయడం, బిల్డింగ్ అంచుల్లో నడవడం, కొండ చివర, జలపాతాల అంచున విన్యాసాలు చేయడం వంటివి నిత్యకృత్యంగా మారింది.
వాటిని సోషల్ మీడియాలో పెడితే విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయని నమ్ముతున్నారు.సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు.
తాజాగా ఓ వ్యక్తి అలాంటి వారందరినీ మించి పోయాడు.ఏకంగా హైటెన్షన్ విద్యుత్ వైర్లపై స్టంట్లు చేశాడు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలోని అమరియా బ్లాక్లో ఇటీవల విచిత్రమైన సంఘటన జరిగింది.
ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ వైర్లపై ఎక్కాడు.ఆపై ఆ విద్యుత్ తీగలపై నడుస్తూ విన్యాసాలు చేశాడు.
పడిపోతాడని అంతా అనుకుంటుండగా, మరికొన్ని వైర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు.అంతటితో ఆగకుండా వేలాడుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
ఇది చూసిన వారంతా ఆందోళన చెందారు.ఎక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడేమోనని అంతా భయపడ్డారు.
కిందికి దిగేయాలని సూచించినా అతడు పట్టించుకోలేదు.
మందు కొట్టి ఉంటాడో లేక సోషల్ మీడియా పిచ్చి కోసమో తెలియదు కానీ స్థానికులను అతడు చాలా టెన్షన్ పెట్టాడు.అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది.పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలవడం వంటి ఘటనలతో విద్యుత్ సరఫరా లేదు.
దీంతో ఆ స్టంట్లు చేసిన వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు.స్థానికులు ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు చేరవేశారు.
విద్యుత్ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని, స్టంట్లు చేసిన వ్యక్తిని నౌషద్గా గుర్తించారు.స్థానికుల సహాయంతో అతడిని క్షేమంగా కిందికి దించారు.దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.