కరోనాతో బంధాలు, బంధుత్వాలు తెగిపోయాయి.కరోనాకు ముందు కుటుంబం, బంధవుల్లో ఎవరైనా చనిపోయారంటే చివరి చూపు చూడాలని అనుకునే వారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా వచ్చిందంటేనే చాలు దూరం పెట్టేస్తున్నారు.ప్రజల్లో అంతలా ప్రాణభయం పుట్టుకొచ్చింది.
కరోనాతో మరణించిన వారిపై వివక్ష చూపొద్దంటూ ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు కల్పించినా అవి మాటలకే పరిమితమయ్యారు.అనాథ శవంలా దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజాగా యాద్రాది భువనగిరి జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (49)కి కరోనా లక్షణాలు రావడంతో కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకున్నాడు.రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో హోం క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు.
పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆ వ్యక్తి మరణించాడు.దీంతో అంత్యక్రియలు నిర్వహించడానికి గ్రామస్థులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఉన్నప్పటికీ మృతదేహాన్ని తరలించేందుకు డ్రైవర్ సైతం నిరాకరించాడు.
ఏం చేయాలో తెలియని పరిస్థితి.దీంతో కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు ధరించి జేసీబీని రప్పించుకున్నారు.
జేసీబీలో మృతదేహాన్ని శ్మశానవాటికను తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.