ఈ కాలంలో బ్రతికున్న తల్లిదండ్రులను కడుపున పుట్టిన బిడ్డలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.అయితే చనిపోయిన తరువాత కూడా వారిని పట్టించుకోకపోవడం వంటి సంఘటనల గురించి వింటే మాత్రం నిజంగా హృదయం ద్రవించుకుపోతుంది.
వృద్ధాప్యం వచ్చిన తరువాత తల్లిదండ్రులను భారంగా భావించే బిడ్డలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అయిపోయారు.అలాంటి కోవకే చెందుతాడు ఈ ప్రబుద్దుడు కూడా.
తన కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు ఈ ప్రబుద్దుడు.ఈ ఉదంతం ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.భద్రక్ జిల్లా బజరాపూర్కు చెందిన అనామచరణ్ బందు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు.
అయితే ఆయన భార్య అనారోగ్యం తో మృతి చెందడం తో ఒక్కగానొక్క కుమారుడు,కోడలు వద్ద కలిసి ఉండాల్సి వచ్చింది.అయితే తండ్రిని చూసుకోవడం ఇష్టం లేని ఆ కుమారుడు,కోడలు ఇద్దరూ కూడా వేధింపులకు గురిచేయడం తో తట్టుకోలేక స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాడు.
గత 17 ఏళ్లుగా స్నేహితుడు గజేంద్ర సాహు ఇంట్లో ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు.అయితే ఇటీవల వయసు పైబడటంతో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యాడు.
దీనితో అతడి ఆరోగ్యం గురించి కుమారుడికి సమాచారం ఇచ్చారు అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి అతడి ఆరోగ్యం విషమించడం తో అనామచరణ్ మృతి చెందారు.అనంతరం తండ్రి మరణ వార్తను కుమారుడికి తెలిపి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.
అయితే, దీనికి అతడు నిరాకరించడమే కాకుండా, తనకు డబ్బులివ్వాలని కోరాడు.
అంతేకాదు, గత 17 ఏళ్లుగా మా నాన్న పెన్షన్ తీసుకుంటున్నారు… రూ.లక్ష ఇస్తేనే తలకొరివి పెడతానని సమాధానమిచ్చాడు.దీంతో బందు స్నేహితుడు గజేంద్ర సాహు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో అనామచరణ్ కుమారుడిని పిలిపించిన పోలీసులు అతడితో చర్చించి చివరికి తండ్రికి తలకొరివి పెట్టడానికి ఒప్పుకొనేలా చేశారు.దీనితో చివరికి బందు కి అతడి కుమారుడు తలకొరివి పెట్టాడు.