ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వ సాధారణం.మారిన జీవన విధానంలో కొందరికి ఆర్థిక కష్టాలు, ఇంకొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి మానసిక ఒత్తిడి .
ఇలా సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయి.అలా అని అందరూ చావే గతి అనుకుంటే ఈ భూమ్మీద మనుషులే ఉండరు.
అయినా కొంత మంది కష్టాలు, సమస్యలు భరించలేక చావే శరణ్యమని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.అలాగే ఆలోచించాడు ఓ వ్యక్తి.తనకి కష్టాలు ఉన్నాయని, బతకడం ఇష్టంలేదని, చచ్చిపోతానని ఫ్లై ఓవర్ ఎక్కాడు.ఈ ఘటన ఢిల్లీ లో జరిగింది.
సెప్టెంబర్ 12న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.ఉత్తరాఖండ్ లోని ఆల్మోరాకు చెందిన ఓ వ్యక్తి (42) ఢిల్లీలోని ఆండ్రూ గంజ్ ఫ్లై ఓవర్ పైనుంచి దూకి చనిపోవాలని సెప్టెంబర్ 12న సాయంత్రం 6 గంటల సమయంలో ఫ్లై ఓవర్ ఎక్కాడు.
అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కిందకు దిగమని చెప్పారు.అయితే ఆ వ్యక్తి తనకు బతకడం ఇష్టం లేదని, చచ్చిపోతానని, కిందకు దిగనని గట్టిగా అరిచి చెప్పాడు.
దీంతో పోలీసులు పొరపాటున దూకేస్తాడేమోనని ముందు జాగ్రత్తగా నెట్ తీసుకొచ్చి పట్టుకున్నారు.చివరికి పోలీసులు వారి మాటలతోనే ఆ వ్యక్తి కి మంచి మాటలు చెప్పి , జీవితం విలువ తెలిసేలా నచ్చజెప్పి కిందకి దిగి వచ్చేలా చేశారు.చనిపోవాలనుకున్న ఆ వ్యక్తి పేరు జగత్ సింగ్ బిస్త్ అని, ఢిల్లీలోని హుజ్ కాస్ ప్రాంతంలో నివసించే వాడని తెలిపారు.
కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకుని ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.