అప్పుడప్పుడు అదృష్టం ఆకాశం నుంచి కూడా రావొచ్చు అనే మాట పెద్దలు తరుచుగా వాడుతూ ఉంటారు.అయితే అదృష్టం ఆకాశం నుంచి ఎలా వస్తుందని ప్రశ్నించివారు ఉంటారు.
నిజానికి ఆ సామెత పరమార్ధం వేరు అదృష్టం ఏదో ఒక రూపంలో వస్తుందని చెప్పడానికి అలా వాడుతారు.అయితే ఒక వ్యక్తికి ఆ సామెత నిజమైంది.
అదృష్టం అతనికి నిజంగానే ఆకాశం నుంచి వచ్చి పడింది.అది కూడా ఒక రాయి రూపంలో.
ఈ ఘటన జరిగింది ఇండోనేషియా దేశంలో.సుమత్రాకు చెందిన జాషువా హుటాగలుంగ్ శవపేటికలు తయారుచేస్తుంటాడు.
గత ఆగస్టులో ఓ రోజు శవపేటిక తయారుచేస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది.ఇంటి వరండా పైకప్పును బద్దలు కొట్టుకుంటూ ఓ గట్టి రాయి వంటి వస్తువు ఆకాశం నుంచి పడింది.
ఆ రాయి పడిన శబ్దానికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అదిరిపోయాయి.ఆ రాయి ఎంతో విశిష్టత కలిగిన అంతరిక్ష ఉల్కగా నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ఉల్కను అమ్మగా రూ.9.8 కోట్లు లభించాయి.దాంతో శవపేటికలు తయారుచేసుకుంటూ పొట్టపోసుకునే జాషువా ఉన్నపళాన సంపన్నుల జాబితాలో చేరిపోయాడు.
అమెరికాకు చెందిన అరుదైన వస్తు సేకర్త జారెడ్ కొలిన్స్ ఈ ఉల్క శిలను జాషువా నుంచి కొనుగోలు చేసి తన సహ వస్తుసేకర్త అయిన జే పియాటెక్ కు విక్రయించాడు.ప్రస్తుతం ఈ ఉల్కను పరిశోధనల నిమిత్తం అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ద్రవరూప నైట్రోజన్ లో భద్రపరిచారు.
తనకు ఈ ఉల్క ద్వారా వచ్చిన డబ్బు 30 ఏళ్ల పాటు శ్రమిస్తే వచ్చే డబ్బుతో సమానం అని జాషువా సంబరం వ్యక్తం చేశాడు.మొత్తానికి అలా శవపేటికలు తయారు చేసుకునే వ్యక్తి ఇంట్లోకి నేరుగా ఆకాశం నుంచి ఉల్క రూపంలో అదృష్టం వచ్చి పడింది.
అందుకే పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు కష్టాన్ని నమ్ముకొని అదృష్టం ఏదో ఒక రూపంలో వస్తుందని.ఇప్పుడు అది జాషువా విషయంలో ప్రూవ్ అయ్యింది.