ఈ మధ్యకాలంలో బంధాలు బంధుత్వాలు అనే దానికి విలువ లేకుండా పోయింది.అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అతి దారుణంగా తల్లిదండ్రులు హతమారుస్తున్న ఘటనలు ఈ రోజుల్లో సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.
ఇలాంటి ఓ దారుణమైన ఘటన జరిగింది మరోసారి.కసాయి గా మారిన తండ్రి రక్తం పంచుకుని పుట్టిన కొడుకు ని దారుణంగా హత్య చేశాడు.
కర్నూలు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి సరితకు ఐదేళ్ల క్రితం వివాహం జరుగగా వీరిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు.కొన్నాళ్ల పాటు వీరి కాపురం హాయిగానే ఉన్నప్పటికీ… భర్తకు భార్యపై అనుమానం మొదలైంది.
వేరొకరితో అక్రమ సంబంధం అంటగట్టడం మొదలుపెట్టాడు భర్త.దీంతో కాపురంలో కలహాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన భర్త నాగేశ్వర్ రెడ్డి రోజూ తాగి వచ్చి భార్య ని వేధించేవాడు.తన ఇద్దరు బిడ్డలు తనకు పుట్టలేదని వేరొకరితో కన్నావు అంటూ భార్యను చిత్ర హింసలకు గురి చేసేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మరోసారి ఫుల్లుగా మద్యం తాగి మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు నాగేశ్వర్ రెడ్డి.
ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న నాగేశ్వర్ రెడ్డి కసాయి గా మారిపోయాడు.
తల్లి ఒడిలో నిద్రపోతున్న 18 నెలల కొడుకూ సందీప్ ను… మరో గదిలోకి లాక్కొని వెళ్లి తలుపులు పెట్టి ఏకంగా కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు.తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు తండ్రి నాగేశ్వర్ రెడ్డి.
పొత్తిళ్లలో ఉండాల్సిన కొడుకు కనిపించకపోవడంతో గాబరా పడిన తల్లి ఇల్లంతా వెతికగా… మరో గదిలో రక్తపుమడుగులో కొడుకును విగతజీవిగా చూసి బోరున విలపించింది ఆ తల్లి.పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు.