గత 17 రోజులుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేస్తూ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దు అంటూ పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల ఉన్న 29 గ్రామాల ప్రజలు సకల జనుల సమ్మె చేస్తున్నారు.
దానిలో భాగంగానే ఈరోజు కూడా నిరసన దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా అక్కడ ఓ విషాదం చోటుచేసుకుంది.
తుళ్లూరు మండలం దొండపాడు కు చెందిన మల్లికార్జునరావు అనే రైతు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో మరణించారు.గత టిడిపి ప్రభుత్వంలో రాజధాని కోసం ల్యాండ్ ల్యాండ్ పూలింగ్ కు మల్లికార్జున రావు 10 ఎకరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తరలిపోతున్న భయంతో గత 15 రోజులుగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మల్లికార్జునరావు పాల్గొంటున్నాడు.ఈయన మృతితో తుళ్లూరు మండలంలోని రైతులు, మహిళలు కొద్దిసేపు మౌనం పాటించి ఈ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతులు బలవుతున్నారు అంటూ మండిపడ్డారు.