ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.
ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.
తీరా పరాయి గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.భార్యలను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.
కొందరైతే వీరిని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటున్నారు.ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.
అటు కన్నవారికి చెప్పుకోలేక.ఇటు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తాజాగా కేరళకు చెందిన ఓ మహిళ యూకేలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.తొలుత గుండెపోటుతో మరణించిందని అంతా భావించారు.కానీ తర్వాత అల్లుడి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.
కేరళకు చెందిన కృష్ణన్కుట్టి, శ్యామల దంపతుల కూతురు షీజా కృష్ణన్ (41) 18 ఏళ్లుగా ఇంగ్లాండ్లో నర్సుగా పని చేస్తున్నారు.షీజా కృష్ణన్కు కొన్నేళ్ల క్రితం బైజు అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు.
వివాహం తర్వాత షీజా తన భర్త బైజుతో కలిసి రెడ్డిచ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.అంతా బాగానే వుందని భారత్లో వున్న కృష్ణన్ కుట్టి దంపతులు గడుపుతున్నారు.
ఈ క్రమంలో గత సోమవారం రాత్రి ఈ వృద్ధ దంపతులకు యూకే నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది.తాను బైజు స్నేహితుడినని.
షీజా గుండెపోటుతో మరణించారని చెప్పాడు.
కలలో కూడా ఊహించని ఈ వార్త విని కృష్ణన్కుట్టి దంపతులకు గుండె పగిలినట్లయ్యింది.
దీంతో బిడ్డను కడసారి చూసేందుకు యూకేకు వెళ్లాలా లేక.షీజా మృతదేహాన్ని కేరళకే పంపుతారా అన్న సమాచారం రాలేదు.గంటలు గడుస్తున్నా అల్లుడు కనీసం తమకు ఫోన్ చేయకపోవడంతో వీరు మరింత ఆందోళనకు గురయ్యారు.దీంతో విషయం కనుక్కునేందుకు గాను యూకేలో తమ బంధువులను, సన్నిహితులను ఆరా తీశారు.
ఈ క్రమంలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.షీజా మరణానికి కారణం గుండెపోటు కాదని.
ఆత్మహత్య చేసుకోవడం వల్లే కూతురు మరణించిందని తెలిసింది.జీవితంలో ఎలాంటి లోటు లేని తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వారికి అనుమానం వచ్చింది.
దీనిపై మరింత లోతుగా ఆరా తీసిన కృష్ణన్కుట్టి దంపతులకు అల్లుడి నిజస్వరూపం తెలిసింది.తమ కూతురిని భర్త చిత్రహింసలు పెట్టేవాడని.
ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పిన గంటల వ్యవధిలోనే షీజా కృష్ణన్ మరణించినట్టు వెల్లడైంది.దీంతో తమ కుమార్తె మరణంపై విచారణ చేపట్టాలని ఆ వృద్ధ దంపతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు.