అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించడం వెనుక భారతీయల పాత్ర మరువలేనిది. ట్రంప్ను కాదని మరి ఈసారి డెమొక్రాట్లకే ఇండియన్స్ జై కొట్టారు.
దీంతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారతీయుల రుణం తీర్చుకునే పనిలో పడ్డారు జో బైడెన్.దీనిలో భాగంగా ఆయన కొలువులో భారత సంతతి వ్యక్తులు కీలక పదవులను దక్కించుకుంటున్నారు.తాజాగా మరో భారతీయురాలికి బైడెన్ కీలక పదవిని కట్టబెట్టారు.కాబోయే అధ్యక్షుని సతీమణి, దేశానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్కు పాలసీ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన మాలా అడిగాను నియమిస్తూ జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా ప్రచార బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు.
ఒబామా అధ్యక్షునిగా వున్న హయాంలోనూ మాలా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఇల్లినాయిస్కు చెందిన మాలా.గ్రిన్నెల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆమె.2008 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒబామా ప్రచార బృందంలో చేరారు.ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాలా అసోసియేట్ అటార్నీ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమితులయ్యారు.బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగానూ బాధ్యతలు చేపట్టారు.
తర్వాత బైడెన్ ఫౌండేషన్లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్గా పనిచేశారు.
కాగా, మాలాతో పాటు తన పాలకవర్గంలో చేరనున్న మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లను జో బైడెన్ వెల్లడించారు.బైడెన్-కమలా ప్రచార బృందంలోని క్యాథీ రస్సెల్ను వైట్హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్గా, కార్లోస్ ఎలిజోండాను అధ్యక్షుడి ప్రత్యేక సహయకుడిగా నియమించారు.వివిధ వర్గాలకు చెందిన వీరంతా అమెరికా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్లోస్ ఎలిజోండా ఒబామా హాయంలో శ్వేతసౌధం సోషల్ సెక్రెటరీగా పనిచేశారు.