భారత సైన్యం లో పనిచేయాలి అంటే తప్పనిసరిగా సోషల్ మీడియా యాప్ లను డిలీట్ చేయాల్సిందే అంటూ ఇటీవల భారత సైన్యం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే భారత సైన్యం చెప్పినట్లుగా ఆ యాప్ లను డిలీట్ చేస్తే తీవ్ర స్తాయిలో నష్టపోతాను అంటూ ఒక లెఫ్టినెంట్ కల్నల్ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల భారత సైన్యం, సైన్యంలో పనిచేసే వారు ఫేస్ బుక్ వంటి పలు సోషల్ మీడియా యాప్ లను డిలీట్ చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి కోర్టును ఆశ్రయించారు.ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేస్తే డేటా, ఫ్రెండ్స్,కంటెంట్ మొత్తం కోల్పోతానని అందుకే దాని నుంచి మినహాయింపు ఇవ్వాలి అంటూ కోర్టును ఆశ్రయించారు.
అయితే దీనిపై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు లెఫ్టినెంట్ కల్నల్ కు గట్టి ఝలక్ ఇచ్చింది.ఫేస్ బుక్ ను వదులుకోవడం ఇష్టం లేకుంటే ఉద్యోగాన్నే వదులుకోవాలంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దేశ భద్రత విషయంలో అనేక ఆందోళనలు చెలరేగుతున్న ఇలాంటి సమయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని,సంస్థ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అంటూ కోర్టు స్పష్టం చేసింది.లేదూ, ఉద్యోగానికంటే మీకు ఫేస్బుక్ అంటేనే ఎక్కువ ఇష్టమనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చని, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇటీవల గత రెండు సంవత్సరాలుగా భారత సైన్యంలో హాని ట్రాపింగ్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత సైన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ సోషల్ మీడియా యాప్ ల ద్వారానే ఈ హానీ ట్రాపింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే గతంలో భారత సైన్యం వాట్సప్ ను డిలీట్ చేయాలని ఆదేశించగా, ఇప్పుడు తాజాగా మరొకొన్ని సోషల్ మీడియా యాప్ లను డిలీట్ చేయాలి అంటూ సైన్యం ఆదేశాలు జారీ చేసింది.