టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన మహేష్, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
విజయ్ దేవరకొండతో గీతా గోవిందం వంటి అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అయ్యాడు.
కాగా మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమా చేస్తాడని ఎంతోకాలంగా వార్తలు వినిపిస్తున్నా, అది వాస్తవరూపం దాల్చలేదు.
దీంతో ఈ కాంబోలో సినిమా ఉంటుందో లేదో అని అందరూ అనుకున్నారు.కానీ మహేష్తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే పరశురామ్ సినిమా ప్రారంభంతో పాటు రాజమౌళి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ గతేడాది కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందడంతో, ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని అభిమానులను కోరారు.
దీంతో మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన పనులను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్కు కూడా మరోసారి ఎదురుచూపులు మిగలడంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటం కూడా ఈ వాయిదాకు ఓ కారణమని వారు అంటున్నారు.