ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.మెల్బోర్న్ సబర్బ్ రౌవిల్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో నవంబర్ 12న ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కానీ నాలుగు రోజులు కూడా గడవకముందే గాంధీ విగ్రహం తలను నరికి వేయడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు.మీడియా కథనాలను బట్టి ఈ ఘటన నవంబర్ 12-13 తేదీలలో జరిగి వుంటుందని అంచనా.
ఈ ఘటనపై రంగంలోకి దిగిన విక్టోరియా పోలీసులు .గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు విగ్రహ ధ్వంసం విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆస్ట్రేలియా ప్రపంచంలోనే బహుళ సంస్కృతులు కలిగివున్న దేశమని.ఇలాంటి చోట సాంస్కృతిక, స్మారక చిహ్నాలపై దాడులను సహించేది లేదని మోరిసన్ స్పష్టం చేశారు.దుండగులు ఆస్ట్రేలియన్ ఇండియన్ సమాజాన్ని కించపరిచారని మోరిసన్ అన్నారు.
ఇక గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కస్టమ్స్, కమ్యూనిటీ సేఫ్టీ అండ్ మల్టికల్చరల్ అఫైర్స్ సహాయ మంత్రి జాసన్ వుడ్ సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది అవమానకరమమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
ఆస్ట్రేలియా అన్ని దేశాల సంస్కృతి, సంప్రదాయాలను జరుపుకుంటుందని జాసన్వుడ్ చెప్పారు.
విక్టోరియాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాశ్ సోనీ సైతం గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని కించపరిచే చర్యగా అభివర్ణించారు.మహాత్మాగాంధీ శాంతి, అహింసకు ప్రతీక అని సూర్యప్రకాశ్ అన్నారు.ఆయన కేవలం ఒక్క భారతదేశానికే నాయకుడు కాదని.
ప్రపంచస్థాయి నేత అని ఆయన వ్యాఖ్యానించారు.ఇంతటి నీచమైన విధ్వంసక చర్యకు ఎవరైనా ఎందుకు ఒడిగడతారో తనకు అర్ధం కావడం లేదని సోనీ ఆవేదన వ్యక్తం చేశారు.నవంబర్ 12 శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి నవంబర్ 13 శనివారం సాయంత్రం 5.30 గంటల మధ్య కింగ్స్లీ క్లోజ్లోని మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు గుర్తు తెలియని దుండగులు పవర్టూల్ను ఉపయోగించినట్లుగా విక్టోరియా పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్లు వారు వెల్లడించారు.