కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.వీరిని శాంతిపజేసేందుకు కేంద్రం పలు దఫాలుగా రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది.
కానీ ఇవి విఫలమవుతూనే వుండటంతో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.మరోవైపు రైతులకు మద్ధతుగా విదేశాల్లోని ప్రవాస భారతీయులు సైతం ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
తాజాగా అమెరికాలో సిక్కులు నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతగా దారి తీసింది.ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆందోళన ముసుగులో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
వివరాల్లోకి వెళితే… భారత్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన వారు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహైయో, నార్త్ కరోలైనా ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు శాంతియుతంగా రాజధాని వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు.
వీరి నిరసనల్ని ఆసరాగా చేసుకున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ జెండాల్ని చేతబూని ర్యాలీ మధ్యలో దూరారు.చూస్తుండగానే విగ్రహం వద్దకు చేరుకొని ఖలిస్థానీ జెండాతో గాంధీ విగ్రహాన్ని కప్పేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
దీనిని గమనించిన భద్రతా దళాలు, అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వారిని హెచ్చరించారు.ఇది కొత్త చట్టం ఉల్లంఘనేనని , వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
కాగా, మహాత్మునికి జరిగిన అవమానాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఖండించింది.సత్యం, అహింస, శాంతికి ప్రతీకగా భావించే గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టింది.ఇందుకు సంబంధించిన వివరాల్ని అమెరికా విదేశాంగశాఖకు తెలిపామని పేర్కొంది.ఇందుకు కారణమైన వారిని న్యాయవ్యవస్థ ముందుకు తీసుకురావాలని ఇండియన్ ఎంబసీ కోరింది.మరోవైపు ఖలిస్తానీల చర్యను భారత్లోని సిక్కు వర్గాలు సైతం తీవ్రంగా ఖండించాయి.నిరసనలు శాంతియుతంగా జరగాలని.
రైతుల ఆందోళన కేవలం చట్టాల రద్దుకు మాత్రమే పరిమితమని.దీనిలో ఇతర అసాంఘిక శక్తులకు తావులేదని తేల్చిచెప్పాయి.
.