మధ్యప్రదేశ్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.రోజు రోజుకు అక్కడ కేసులు పెరిగిపోతుండడం తో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఈ మహమ్మారి సోకుతుండడం మరింత కలవరం రేపుతోంది.
ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.
ఇటీవల కరోనా లక్షణాలు రావడం తో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపిన విషయం విదితమే.ఈ క్రమంలోనే తనను కలిసిన వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే ఆయన ఇంకా కరోనా నుంచి కోలుకోకుండానే ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది.అంతకు ముందు క్యాబినెట్ మినిస్టర్ బడోరియా కూడా కరోనా బారిన పడగా ఆయన కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
నీటి వనరుల శాఖా మంత్రి తులసీరామ్ సిలావత్, పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రామ్ ఖేలావన్ పటేల్ కు కూడా కరోనా సోకడం కలకలం రేపింది.
సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా మహమ్మారి బారిన పడుతుండడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28 వేలకు పైగా నమోదు కాగా, మరణాలు 8 వందలకు పైగా నమోదు అయినట్లు తెలుస్తుంది.