ఒక్కో సారి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.వారు చేసే చేష్టలు కూడా కొన్ని సార్లు విమర్శల పాలవుతాయి.
చాలా సందర్భాల్లో వాటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా… కుదరదు.ఒకప్పుటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని ప్రజాప్రతినిధులు గుర్తించాలని పలువురు పేర్కొంటున్నారు.
ఇలా రోజూ అనేక మంది నాయకులు ప్రవర్తిస్తుంటారు.తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా మంత్రి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
ఇంతకీ ఆ మహిళా మంత్రి ఎవరు? ఏమందంటే….
మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాగూర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ఆమె హాట్ టాపిక్ గా మారారు.
తనతో సెల్ఫీ తీసుకోవాలనుకునే వారు 100 రూపాయలు ఇవ్వాల్సిందే అని ఈ మంత్రి ప్రకటించారు.పైగా తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకున్నారు.
సెల్ఫీలు తీస్తుంటే… చాలా సమయం వృథా అవుతుందంటూ చెప్పుకొచ్చారు.దీంతో తాము వెళ్లాల్సిన పనులు వాయిదా పడిన సందర్బాలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అందువల్లే ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇలా సెల్ఫీలు తీసుకోవడం వల్ల సమకూరిన డబ్బుతో పార్టీ కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు.అంతే కాకుండా బహిరంగ కార్యక్రమాలకు హాజరయినపుడు చాలా మంది పుష్పగుచ్ఛాలు, శాలువాలు ఇస్తారని అలా కాకుండా పుస్తకాలు ఇవ్వాలని ఆమె ప్రజలకు సూచించారు.ఇలా వచ్చిన పుస్తకాలతో లైబ్రరీ కూడా ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
మరో విషయం ఏంటంటే… మంత్రి ఉషా ఠాగూర్ ఇంతకు ముందు ఓ సందర్భంలో మాట్లాడుతూ… ఎవరైతే రెండు డోసుల కరోనా టీకాలు తీసుకుంటారో వారందరూ పీఎం కేర్స్ నిధికి తలా 500 రూపాయలను విరాళంగా ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.