జనసేన పార్టీ చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు గంగాధరం ఎట్టకేలకు ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరారు.ఆయన జనసేన లో ఉన్నప్పటి నుంచి కొంతకాలం పాటు పవన్ ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఆ తర్వాత క్రమంలో నాదెండ్ల మనోహర్ కు పార్టీలో ప్రాధాన్యం పెరగడం, గంగాధర్ సూచనలు సలహాలను పెద్దగా పట్టించుకోక పోవడం తదితర కారణాలతో ఆయన సైలెంట్ గా నే ఉంటూ వస్తున్నారు.తాజాగా ఆయన ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పైన , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు.టిడిపి అధినేత చంద్రబాబు కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలను తిప్పి కొట్టాలని, అది నిజం కాదు అని ఒక మాట చెబుతూ ప్రకటన చేద్దామని తాను అనేకసార్లు సూచించానని, అయినా తన మాటను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు అని విమర్శలు చేశారు.
జనసేన పార్టీని నమ్ముకుని ఎంతో మంది తమ ఉద్యోగాలను మానుకుని జనసేనలో చేరారని, కానీ పవన్ వారిని నట్టేట ముంచారని మాదాసు విమర్శలు చేశారు.ఇక నాదెండ్ల మనోహర్ పవన్ ను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని , గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం లేదనే విధంగా మనోహర్ వ్యవహరించారని, పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేద్దామని పవన్ కు చెప్పినా పట్టించుకోలేదని మాదాసు గంగాధరం విమర్శించారు.
ఎవరో కొంతమంది రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ప్రభుత్వంపై కావాలని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని , పవన్ అలా చేయడం తనకు నచ్చలేదని అందుకే చాలాకాలంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని చెప్పారు.
వైసీపీలో చేరాల్సిందిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు కోరుతున్నారని , అందుకే ఇప్పుడు వైసీపీలో చేరతానని తెలిపారు.తన కుమారుడు మాదాసు పవన్ ఇప్పటికే వైసీపీలో ఉన్నారని, ఈ సందర్భంగా తెలిపారు.వైసీపీలో తనకు ఏ పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
.